Supreme Court: పరీక్షలు రద్దు.. ఏపీ, కేరళ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
- kunduru Vinod
- Published On : June 22, 2021 / 04:58 PM IST
Supreme Court (2)
Supreme Court: సీబీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు రెండవ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో అనిశ్చితి ఎందుకు కొనసాగుతుందని ప్రశ్నించింది. పరీక్షలకు వెళ్ళాలి అనుకుంటే పూర్తి వివరాలు అఫిడవిట్లో తెలపాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
పరీక్షల రద్దుపై రెండు రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఒక్క మరణం సంభవించినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక 11 తరగతి పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
కాగా సోమవారం పరీక్షలు రద్దు చేయని నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. నోటీసుల అనంతరం, అస్సాం, త్రిపుర, పంజాబ్ బోర్డులు పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రద్దు ప్రకటన రాకపోవడంతో సుప్రీం కోర్టు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేయాలనీ కోరింది.
అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
