Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశం
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.
- Harishth Thanniru
- Published On : June 3, 2024 / 12:21 PM IST
Pinnelli RamaKrishna Reddy
Pinnelli RamaKrishna Reddy : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో శేషగిరి రావు పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది.
Also Read : కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
జూన్ 6వ తేదీన ఈవీఎం ధ్వంసం కేసుపై హైకోర్టులో సమగ్ర విచారణ జరిపి కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దన్న ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయవ్యవస్థను హేళన చేసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read : Pinnelli Ramakrishna Reddy : హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట..
విచారణ సమయంలో న్యాయమూర్తులకు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు చూపించారు. అయితే, ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదని పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన బెంచ్.. అక్కడ ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపింది. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని, జూన్ 6న లిస్టయిన ఈ పెండింగ్ కేసుపై, హైకోర్టు పిటిషన్ను త్వరగా విచారణ ముగించాలని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అంశంతో ప్రభావితం కాకుండా కేసులోని మెరిట్స్ ప్రకారం విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
