AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాళ్లు?

టీడీపీ, జనసేన నేతలు ఓ అవగాహనకు వచ్చినా బీజేపీకి పది శాతం పదవులను మాత్రమే ఇస్తామనడటం..

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సస్పెన్స్‌ ఇంకెన్నాళ్లు… పదవుల పంపకంపై ఎప్పుడో లెక్క కుదిరినా.. నియామకాల్లో జాప్యం ఎందుకు? కూటమిలోని మూడు పార్టీల నేతలు ఎంతో ఆత్రుతగా చూస్తున్న నామినేటెడ్‌ పోస్టులపై కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదా? బీజేపీ అధ్యక్షురాలు పుందేశ్వరి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు కలిసినట్లు..? బీజేపీ కోటా పదవులను ఇంకా పెంచాలని కమలనాథులు డిమాండ్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 80 రోజులు కావస్తోంది. నామినేడెట్‌ పోస్టుల భర్తీపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా, వారి విజయం కోసం పనిచేసిన నేతలు… పొత్తు ధర్మం కింద సీట్లు త్యాగం చేసిన నేతలు నామినేటెడ్‌ పదవుల భర్తీపై ఆశగా ఎదురుచూస్తున్నారు.

నేడు.. రేపు అంటూ రోజులు, తేదీలు మారుతున్నాయేగానీ, పదవుల పందేరంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే మూడు పార్టీల్లో నామినేడెట్‌ పోస్టులపై ఓ అవగాహన కుదిరినా… తాజాగా మళ్లీ తమ కోటా పెంచాలంటూ బీజేపీ డిమాండ్‌ చేస్తుందన్న ప్రచారంతో నామినేడెట్‌ పోస్టుల భర్తీ మళ్లీ పెండింగ్‌లో పడిపోయిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నామినేటెట్‌ పోస్టులపై అవగాహన
కూటమిగా పోటీచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు… ఎన్నికల అనంతరం నామినేటెట్‌ పోస్టులపై ఓ అవగాహన కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం పదవుల భర్తీకి ఒప్పందం కుదిరింది. రాష్ట్ర స్థాయిలో ఈ నిష్పత్తి ప్రకారమే పదవుల పంపకం జరగనుందని ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. ఇక నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల తొలివారంలో రాష్ట్రస్థాయిలో పదవుల పంపకంపై అవగాహన కుదరగా, రెండో వారం వరకు ఆషాడం ఉందన్న కారణంతో పదవుల భర్తీ ప్రక్రియను ముందుకు కదిలించలేదు. ఇక ఈ నెల 16 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయని… లిస్టు రెడీ అవుతుందని టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఐతే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నామినేడెట్‌ పోస్టుల భర్తీపై ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయడంలేదు. ఇదే సమయంలో జనసేనాని పవన్‌ సైతం నామినేడెట్‌ పోస్టులపై తనపై ఒత్తిడి చేయొద్దని… పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని చెప్పుకొస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ తుది నిర్ణయం తీసుకున్నారని, లిస్టు రిలీజ్‌ చేయడమే ఆలస్యమని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు.

ఫైనల్‌ కాకపోవడంతోనే?
బీజేపీ కోటా కింద ఇవ్వాల్సిన లిస్టు ఇంకా ఫైనల్‌ కాకపోవడంతో పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ మంగళవారం బీజేపీ రాష్ట్ర నేతలు… పార్టీ చీఫ్‌ పురందేశ్వరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె సీఎం చంద్రబాబును కలవడంతో బీజేపీ వల్లే నామినేడెట్‌ పోస్టుల నియామకంపై తుది నిర్ణయం తీసుకోలేదనే ప్రచారం మరింత ఎక్కువైంది.

అదేసమయంలో తమ పదవుల కోటా మరింత పెంచాలని పురందేశ్వరి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇదేసమయంలో బీజేపీ కేంద్ర పెద్దలు కూడా కొన్ని పదవులు అడిగారని… అన్నీ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నామినేడెట్‌ పోస్టుల భర్తీపై తర్జనభర్జనలు ఇంకా కొనసాగుతున్నట్లేనంటున్నారు.

టీడీపీ, జనసేన నేతలు ఓ అవగాహనకు వచ్చినా బీజేపీకి పది శాతం పదవులను మాత్రమే ఇస్తామనడటం, ఆ పార్టీలో పదవులపై పోటీ ఎక్కువగా ఉండటం వల్ల తమ కోటాపై పునః సమీక్షించాలని పురందేశ్వరి కోరుతున్నారు. అయితే టీడీపీలో కూడా నామినేడెట్‌ పోస్టులపై తీవ్ర పోటీ ఉంది.

గత ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడిన తమకు పదవులు ఇవ్వాలని కొందరు… ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేశామని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అదేసమయంలో జనసేనలోనూ ఇదేరకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మూడు పార్టీల్లోనూ ఎక్కువ పదవులు కావాలని ఆశావహులు ఎగబడుతుండటంతో ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారట సీఎం చంద్రబాబు.

Also Read : వైసీపీని వీడేది లేదు.. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తా : విజయసాయిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు