Chandrababu Naidu : విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో 200 మంది అస్వస్ధతకు గురవ్వటం చాలా బాధాకరం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు లీక్ ఘటన ఆందోళనకరం కలిగించిందని ఆయన అన్నారు.
గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని చంద్రబాబు అన్నారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కాగా …..అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారి తీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీక్ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.