TDP Ex MLA Sugunamma
Ex Mla Sugunamma Emotional : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో తిరుపతి టికెట్ టీడీపీకేనని, తానే పోటీ చేస్తానని ఇన్నాళ్లు భావించిన తిరుపతి టీడీపీ ఇంచార్జి సుగుణమ్మకు చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆమె సోమవారం మీడియా ఎదుట కన్నీటి పర్యాంతమయ్యారు. పార్టీకోసం కష్టపడిన మాకు టికెట్ దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను ఆమె కోరారు.
Also Read : వెనక్కు తగ్గేదిలేదు.. ఆ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకుని పోటీ చేస్తా : పోతిన మహేష్
టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని, చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని సుగుణమ్మ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా పార్టీ కేడర్ అంగీకరించడం లేదని పేర్కొన్నారు. తిరుపతి అభ్యర్థిపై చంద్రబాబు, పవన్ మరోసారి పునరాలోచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. టీడీపీ, జనసేన ముఖ్య నేతలు తిరుపతి టికెట్ పై పునరాలోచన చేయాలని, వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదని అన్నారు. తిరుపతిలో వైసీపీ నేతల ఆగడాలపై అడుగడుగునా పోరాటం చేశానని సుగుణమ్మ చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే ఆలోచన లేదని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి పునరాలోచన చేస్తారని నాకు నమ్మకం ఉందని సుగుణమ్మ అన్నారు.
Also Read : హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..