TDP Leader Pattabhi : కుటుంబంతో కలిసి బయటకు వచ్చా…త్వరలోనే నా విధి నేను చేస్తాను..తప్పుడు కేసులకు భయపడను అంటూ…టీడీపీ నేత పట్టాభి వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జైలుకెళ్లిన అనంతరం ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగాయి. శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం హనుమాన్ జంక్షన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…విజయవాడకు బయలుదేరారు. తర్వాత..ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కలకలం రేగింది.
ఆయన్ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారనే వార్త పుకారు షికారు చేసింది. కానీ…ఆయన్ను పోలీసులు అరెస్టు చేయలేదని…కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లినట్లు మరో ప్రచారం జరిగింది. వీటికి బలం చేకూరుస్తూ…పట్టాభి విమానంలో కూర్చొన్న ఫొటోలు, ఎయిర్ పోర్టులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు సమాచారం. దేశం వదిలిపారిపోతున్నారంటూ…సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో..ఆయన స్పందించారు. 2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం …ఓ వీడియో విడుదల చేశారు. భార్యతో బయటకు వెళితే అనేక అనార్థాలు తీస్తున్నారని వెల్లడించారు. తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చినట్లు, అతి త్వరలో…మళ్లీ వచ్చి తన విధి తాను చేస్తానని వీడియోలో వెల్లడించారు పట్టాభి. తప్పుడు కేసులకు భయపడనని, తనింటిపై వైసీపీ నేతలు జరిపిన దాడిలో తన కుమార్తె భయబ్రాంతులకు గురైందని తెలిపారు. ఒక తండ్రిగా..నా కుమార్తెకు బాధ్యత స్వీకరిస్తానని, తనపై పెట్టిన తప్పుడు కేసులకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని పట్టాభి తెలిపారు.