Chandrababu Naidu Arrest: ఏపీ వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు.. గవర్నర్ను కలవనున్న టీడీపీ నేతల బృందం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
- Harishth Thanniru
- Published On : September 10, 2023 / 07:27 AM IST
Chandrababu Arrest
TDP Leaders: చంద్రబాబు అరెస్టు విషయంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను ఆదివారం ఉదయం టీడీపీ నేతల బృందం కలవనుంది. ఉదయం 9.45 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా.. వారికి అనుమతి లభించింది. వాస్తవానికి శనివారం సాయంత్రమే టీడీపీ నేతలు గవర్నర్ ను కలవాల్సి ఉంది. విశాఖ పోర్టు అతిథిగృహంలో ఉన్న గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు గవర్నర్ ను కలిసేందుకు అనుమతి లభించింది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆదివారం గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. గవర్నర్ ను కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైకాపా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఫిర్యాదు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ కేసులకు నిరసనగా ఆదివారం ఉదయం నియోజకవర్గం ప్రధాన కేంద్రాల్లో నిరాహార దీక్షలను టీడీపీ నేతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
