×
Ad

AP Illicit Liquor Deaths : టీడీపీ నిరసన ప్రదర్శన.. జగన్ ఫొటోకి మద్యంతో అభిషేకం

నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అని...

  • Published On : March 21, 2022 / 01:49 PM IST

Ap Tdp

TDP MLAs, MLCs : టీడీపీ నిరసనలు చేపడుతోంది. కల్తీ మద్యం అమ్మకాలు, జే బ్రాండ్ మద్యంతో వందలాది మంది చనిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 2022, మార్చి 21వ తేదీ వరుసగా ఐదో రోజు సోమవారం ఎమ్మెల్సీ లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నేతలు నిరసన తెలిపారు. నిరసనల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ జరిగింది. కల్తీ నాటుసారాతో రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ మద్యం వల్ల వందలాది చనిపోతున్నారంటూ ఆరోపించారు. అయితే.. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అని నినాదాలు చేశారు. కల్తీ నాటు సారాతో పాటు జే బ్రాండ్ తో జగన్ జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్ల కార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని నేతలు మండిపడ్డారు.

Read More : AP Assembly : స్పీకర్ సీరియస్.. బజార్ కాదు.. శాసనసభ, మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

రాష్ట్రంలో కరోనా మరణాలతో పోటీగా కల్తీ నాటు సారా మరణాలు చోటు చేసుకుంటున్నాయని నేతలు విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యం, నాటుసారాతో మహిళల మాంగల్యాలు జగన్ తెంచుతున్నారని, ఆయన మాటలు, పోలీసు FIRలలో ఏది నిజం అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం రాజీనామా చేయాలని, కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకెన్ని సారా చావులు జగన్ కోరుకుంటారని నిలదీశారు. కల్తీ సారా మరణాల పై ప్రశ్నిస్తే అన్యాయంగా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. నాటుసారా, చీప్ లిక్కర్ ని జగన్ ప్రమోట్ చేస్తున్నారని, కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణ జరపాల్సిందేనని ఎమ్మెల్యే చిన రాజప్ప డిమాండ్ చేశారు. ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా సీఎం వైఖరిలో మార్పు లేదన్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీ కాస్త మద్యాంధ్ర ప్రదేశ్ గా మారిందని ప్రజాకోర్టులో జగన్ శిక్ష తప్పదన్నారు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్.