Chandrababu Pawan Representative Image (Image Credit To Original Source)
Central Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. లడ్డూ వివాదంలో సిట్ ఇచ్చిన నివేదికపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు, మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టులు, నీటి సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వానికి ఓ బెర్త్ దక్కుతుందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుంది అనేది కీలకంగా మారింది. జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనే ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించబోతున్నట్లుగా సమాచారం.
సాయంత్రం 7 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి పయనం కాబోతున్నారు. రాత్రి కొంతమంది ప్రముఖులను కలిసే అవకాశం ఉంది. రేపు కీలక సమావేశాలు ఉంటాయని సమాచారం. ముఖ్యంగా మిలిందా గేట్స్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంది. మొన్ననే క్వాంటం వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్ కు శంకుస్థాపన కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహకారం అవసరం ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం ఆశిస్తోంది ఆంధ్రప్రదేశ్.
కేంద్ర మంత్రులను కలిసి వారి శాఖల ద్వారా ఏపీకి సహాయ సహకారాలు కోరబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు రాత్రికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేయనున్నారు. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు కేంద్ర మంత్రులను కలిశాక సాయంత్రానికి ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం ఉంది.
Also Read: తిరుమల లడ్డూ వివాదంలో అసలు ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు?: తమ్మారెడ్డి