Mydukur Municipality : మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ, క్యాంపు రాజకీయాలు షురూ

కడప జిల్లా మైదుకూరు మున్సిపల్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Updated on- March 14, 2021 / 06:01 PM IST

Mydukur Municipality

mydukur Municipality : మున్సిపల్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగింది. విపక్షాలు గల్లంతయ్యాయి. ఊహించని విజయాలు సొంతం చేసుకొంటోంది వైసీపీ. కానీ సీఎం జగన్ సొంత జిల్లాలో వైఎస్సార్ కడప జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మైదుకూరు మున్సిపాలిటీ లో మొత్తం 24 వార్డులు ఉండగా టీడీపీకి 12.. వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. జనసేన ఒక వార్డులో గెలిచింది.

సంఖ్యా పరంగా టీడీపీ అత్యధిక స్థానాలు గెలిచినట్లయ్యింది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి పార్టీలు. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓట్లు కలుపుకుంటే వైసీపీ బలం 13 కు చేరుతుంది. చైర్మన్ ఎన్నిక రోజు జనసేన అభ్యర్థి హాజరుకాకపోతే వైసీపీకి మున్సిపల్ పీఠం దక్కుతుంది. ఒకవేళ జనసేన అభ్యర్థి టీడీపీకి మద్దతిస్తే లాటరీ పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశముంది. అయితే..తమ అభ్యర్థులు చేయి జారిపోకుండా ఉండేందుకు టీడీపీ తగు జాగ్రత్తలు తీసుకొంటోంది.