corona vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళే మా పెళ్లికి రండి…
గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది.
- bheemraj
- Published On : March 24, 2021 / 02:07 PM IST
Corona Vaccine
corona vaccine : కరోనా రెండో దశ ప్రారంభమై పలు రాష్ట్రాలు, దేశాల్లో లాక్డౌన్ విధించడంతో గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది. సత్తెనపల్లికి చెందిన గోకుల్కు విజయవాడకు చెందిన భావ్యతో జనవరి 9న నిశ్చితార్థం జరిగింది. జూన్ 5న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.
ఈ నేపధ్యంలో బంధువులంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు సాయిభాస్కర్ హాస్పటల్లో ఒకేసారి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఒకేసారి ఇటు మగపెళ్లి వారు 20 మంది, అటు విజయవాడలో పెళ్ళి కూతురు భావ్య కుటుంబ సభ్యులు 20 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వివాహానికి హాజరయ్యే బంధువులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ఇప్పటికే వాట్సాప్ల ద్వారా, ఫోన్లు చేసి మరీ సమాచారమిచ్చారు.
అందరినీ చైతన్య పరిచేలా మంచి నిర్ణయం తీసుకున్న పెళ్లి కుమారుడు గోకుల్తో పాటు, పెళ్లి కుమార్తె భావ్య కుటుంబ సభ్యులనూ గుంటూరులోని సాయిభాస్కర హాస్పిటల్ యజమాని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి సన్మానించారు.
