BRS AP President Chandrasekhar
BRS AP President Chandrasekhar: ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలుస్తారని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం బెజవాడలో వంగవీటి రంగా విగ్రహానికి చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలతో కార్లలో ర్యాలీగా వెళ్లి బందరు రోడ్డులో రంగా విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వంగవీటి రంగాను స్మరించుకోకుండా ఉండలేమని అన్నారు. ఏపీకి ఎన్నో సమస్యలున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని, ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్ధితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Thota Chandrasekhar : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, సంక్రాంతి తర్వాత మరింత దూకుడు
పోలవరం నిర్మాణంలో కేంద్రం సహకారం రావడం లేదని అన్నారు. దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కి లేదన్నారు. తెంలగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ ని ఏపీలో మేం అమలు చేస్తామని అన్నారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల నుంచీ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారని చంద్రశేఖర్ తెలియజేశారు. ఏపీలో ప్రతిపక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చంద్రశేఖర్ అన్నారు. చాలా మంది నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు మాతో సంప్రదిస్తున్నారని, త్వరలోనే వారంతా బీఆర్ఎస్లోకి వస్తారని, ఏపీలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని తోట చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.