Raghunandan Rao : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి హైదరాబాద్లో రూ.4వేల కోట్ల విలువైన భూములు- బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
హైదరాబాద్ హఫీజ్ పేటలోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తెలంగాణ సీఎం కేసీఆర్.. తోట చంద్రశేఖర్ కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు.(Raghunandan Rao)
Raghunandan Rao : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ హఫీజ్ పేటలోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తెలంగాణ సీఎం కేసీఆర్.. తోట చంద్రశేఖర్ కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు.
అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూ కుంభకోణం జరిగిందన్నారు. సుకేశ్ గుప్తా 7 ఎకరాల కోసం కోర్టుకి వెళ్లిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. 40 ఎకరాల కోసం ఎందుకు కోర్టుకెళ్లలేదన్నారు. ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.
“రూ.4 వేల కోట్ల విలువైన హఫీజ్ పేట భూములను తోట చంద్రశేఖర్కు కేసీఆర్ అప్పగించారని ఆరోపణలున్నాయి. సోమేష్ కుమార్ కనుసన్నలోనే ఈ భూకుంభకోణం జరిగింది. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్లు ఇప్పుడు రక్తసంబంధీకులు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి? తోట చంద్రశేఖర్కు భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉంది. సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోట చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు.
సర్వే నంబర్ 78లో జరుగుతున్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. 8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు ఒక న్యాయమా ?. మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలి. సర్వే 78 లో 40 ఎకరాల భూములను తోట చంద్రశేఖర్కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారు. బిహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్కు ప్రేమ ఎక్కవ. అందులో భాగంగానే బిహార్కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారు” అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
ఈ భూముల విక్రయాల ద్వారా తోట చంద్రశేఖర్కు రూ.4 వేల కోట్లు వచ్చాయని.. ఆ కృతజ్ఞతతోనే ఖమ్మం సభకు ఆర్ధిక సాయం చేశారని కూడా రఘునందన్ రావు ఆరోపించారు. భూముల అక్రమాలపై సుప్రీంకోర్టు గడప తొక్కుతామని ఆయన స్పష్టం చేశారు.(Raghunandan Rao)
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తున్న కేసీఆర్.. అందులో భాగంగా బీర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఏపీలో రానున్న రోజుల్లో భారీగా పార్టీలో చేరికలు ఉంటాయని కేసీఆర్ చెబుతున్నారు. ఎందరో కీలక నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత ఏపీ నుండి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు.