TTD : తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఒకే టికెట్పై మూడు రోజులు స్వామివారి దర్శనం.. టికెట్ ఇలా బుక్ చేసుకోండి?
TTD : మే 21వ తేదీన ఉదయం 10గంటలకు ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ టికెట్ ను ఇద్దరికీ కలిపి రూ.5వేలు చెల్లించి కొనుగోలు చేయాలి.
- Harish Thanniru
- Published on- May 17, 2026 / 08:14 AM IST
tirumala tirupati devasthanam
- తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం
- ఒకే టికెట్పై వరుసగా మూడు రోజులు దర్శనం
- 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక వర్గం అద్భుత అవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని ఒకే టికెట్ పై వరుసగా మూడు రోజులు దర్శనం చేసుకునే అవకాశం దక్కనుంది. పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజులు పాటూ ఒకే టికెట్ పై శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.తిరుమల పవిత్రోత్సవాలకు ఆగస్టు 22వ తేదీన అంకురార్పణ జరగనుంది. ఆగస్టు 23వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్రం ప్రకారం.. ఏడాది పొడవునా జరిగే పూజలు, అర్చనలు, ఉత్సవాల సమయంలో తెలియక జరిగే దోషాల నివారణ కోసం ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో ఒక్కసారి టికెట్ బుక్ చేసుకుంటే.. ఒకే టికెట్పై మూడు సార్లు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
మే 21వ తేదీన ఉదయం 10గంటలకు ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ టికెట్ ను ఇద్దరికీ కలిపి రూ.5వేలు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ టికెట్లు పొందిన భక్తులు తిరుమలలో నిర్వహించే పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపన తిరుమంజనంలో పాల్గొనే అవకాశం ఇస్తారు. అంతేకాదు.. పవిత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు పూర్ణాహుతిలో కూడా పాల్గొనవచ్చు. ప్రత్యేక దర్శన సౌకర్యం ఉంటుంది.
తిరుమలలో మూడు రోజులు జరిగే పవిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు టికెట్ పొందిన భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదయం 7గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద హాజరు కావాలి. సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును చూపిస్తేనే అనుమతిస్తారు.
