Tirupati Brahmotsavam 2021: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై స్వామివారు
గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతుండగా.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనువిందు చేస్తున్నారు.
- vamsi
- Published On : October 9, 2021 / 06:44 AM IST
Tirupati Brahmotsavam 2021 (2)
Tirupati Brahmotsavam 2021: గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతుండగా.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనువిందు చేస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామిగా శ్రీవారు భక్తులతో పూజలందుకున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తారు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచికగా నిలుస్తుంది.
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
కాగా, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన ఈరోజు(శనివారం) ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
