Tirupati Road Accident : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొనడంతో.. 30మందికిపైగా..
Tirupati Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 30మందికి గాయాలయ్యాయి.
- Harish Thanniru
- Updated on- June 22, 2026 / 11:16 AM IST
Tirupati Road Accident
- తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి
- 30మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Tirupati Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్వితలు మృతి చెందగా.. మరో 30మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప – చెన్నై జాతీయ రహదారిపై లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకున్నాయి. కడప డిపోకు చెందిన నాన్స్టాప్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తిరుపతి వైపు నుంచి కపడకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూడగా.. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోవడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సు శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని 108 సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన 30మందిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ప్రమాదంకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. మరోవైపు.. తిరుపతిలో రోడ్డు ప్రమాదంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరైన చికిత్స అందించాలని అధికారులు, వైద్యులకు మంత్రి సూచించారు.
