Tragedy In Marriage : కాసేపట్లో కన్యాదానం, ఇంతలోనే దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో కన్న కూతురి వివాహం. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రుల
- Naveen
- Published On : August 26, 2021 / 11:09 PM IST
Tragedy In Marriage
Tragedy In Marriage : విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో కన్న కూతురి వివాహం. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రులు చనిపోయారు.
పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఫంక్షన్ హాల్ నుంచి వారి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కోసం బంధువులు వెతగ్గా.. వారు కనిపించ లేదు. దంపతులు కనిపించకపోవడంతో ఇంటికెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు.
వధువు తల్లిదండ్రులు విగతజీవులై కనిపించారు. మృతులు విశాఖపోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులుగా పోలీసులు గుర్తించారు.
పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని.. పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడిందని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తానుకూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు.
ఈ ఘటనతో వధువు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది.
