TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్ల బుకింగుల్లో దళారుల ప్రమేయానికి ఇక చెక్.. అమల్లోకి కొత్త విధానం..

టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Tirupati Devasthanams

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, గదులు సహా తదితర టికెట్ల బుకింగుల విషయంలో దళారులను నమ్మి అనేక మంది భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే, ఇకనుంచి టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.

Also Read: వావ్.. ఏపీ, తెలంగాణ మధ్య కేబుల్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై ఆ కేబుల్ బ్రిడ్జితో వాళ్లకి 90 కి.మీ దూరం తగ్గుతుంది..

టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ వంటి సేవలకోసం ఆన్ లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటారు. అయితే, ఈ సమయంలోనూ దళారుల బెడద తప్పడం లేదు. వీటిని అడ్డుకోవడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది.

 

భక్తుల ఆధార్ ఆథెంటికేషన్ అనుమతి కోసం గతేడాది జులైలో దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఆ లేఖను కేంద్ర ప్రభు త్వానికి పంపించింది. ఆగస్టులో కేంద్రం నుంచి అనుమతి లభించింది. దానిపై నవంబరు 18న టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు నోటిఫికేషన్ ను గెజిట్ లో ప్రచురించారు.

ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు వల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల గుర్తింపును పరిశీలించేందుకు, ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు, సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ క్రమబద్దీకరణకు వీలవుతుంది.