Tirumala Srivari Sarva Darshan : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సూర్యగ్రహణం కంటే ముందు, తరువాత రద్దీ తగ్గగా శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 63,512 మంది భక్తులు దర్శించుకోగా.. 35,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నవంబర్ 1 నుండి జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శని, ఆది, సోమ, బుధ వారాల్లో 20 నుండి 25 వేల ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తారని వెల్లడించారు. మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో 15,000 టోకెన్ల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారని పేర్కొన్నారు.
టోకెన్లు ఏరోజుకారోజు మాత్రమే ఇవ్వనున్నట్లు చెప్పారు. టోకెన్లు లభించని భక్తులు ఎటువంటి టోకన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవచ్చన్నారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామని తెలిపారు. డిసెంబర్ 1 నుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 గంటల నుండి 11:30 గంటల వరకు ప్రయోగాత్మకంగా అనుమతి ఇస్తామని చెప్పారు.
రాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. శ్రీ వాణి ట్రస్ట్ భక్తుల కోసం తిరుపతిలో మాధవ నిలయంలో 140 గదులను ప్రయోగాత్మకంగా డిసెంబర్ 1 నుండి కేటాయించినట్లు తెలిపారు. తిరుమలలో క్షురకులు ధర్నాలు చేయడం టీటీడీ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ధర్నాలు చేసిన క్షురకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tirumala Srivari Break Darshan : డిసెంబరు 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమలలో ఎసెన్సియల్ సర్వీసెస్ విభాగాల్లో పనిచేసే ఎవరు కూడా ధర్నాలు, సమ్మెలు చేయడం నిషేధమని స్పష్టం చేశారు. భక్తులు ఇస్తున్నారు తాము తీసుకుంటున్నామని క్షురకులు అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చినా లంచంతో సమానమేనని స్పష్టం చేశారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.