Tirumala Srivari Arjitaseva Tickets : తిరుమల శ్రీవారి ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లు.. ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను ఈ నెల 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది.
- bheemraj
- Published On : September 19, 2022 / 03:58 PM IST
Tirumala Srivari Arjitaseva Tickets
Tirumala Srivari Arjitaseva Tickets : తిరుమల శ్రీవారి ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను ఈ నెల 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21న విడుదల కానున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్ లో విద్యుత్ బస్సును ఆర్టీసీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రవివర్మ, తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చంగల్ రెడ్డి, తిరుపతి డిపో మేనేజర్ పి. విశ్వనాథ్ పరిశీలించారు. ఓలెక్ట్రా కంపెనీకి చెందిన అధునాతన విద్యుత్ బస్సును ఆర్టీసీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మెకానికల్ ఇంజనీర్ రవివర్మ మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.
విద్యుత్ బస్ లో ఎటువంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్డు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తిరుమల తిరుపతిల మధ్య ఈ నెలాఖరికి 10 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తిరుమల ఘట్ రోడ్డులో మొత్తం 50 విద్యుత్ బస్సులు డిసెంబర్ చివరి నాటికి తిప్పడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే తిరుపతి నుండి ఇతర ప్రాంతాలకు విద్యుత్ బస్సులు నడపనున్నామని పేర్కొన్నారు. మొత్తం తిరుపతి జిల్లాకు 100 విద్యుత్ బస్సులు కేటాయించామని వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన విద్యుత్ బస్సులు నడపపనున్నట్లు తెలిపారు. విద్యుత్ బస్సుల ఆపరేటింగ్ మెయింటినెన్స్ బస్సు తయారీ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు.
