ఎన్నికల వేళ ఉండి నియోజకవర్గం టీడీపీలో మరింత ముదిరిన వివాదం
AP Elections 2024: పార్టీ కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు శివరామరాజు.
- T Venkateshwarlu
- Published On : March 13, 2024 / 04:43 PM IST
Shivaramaraju
Vetukuri Venkata Siva Rama Raju: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు దూరమవుతున్నారు. తాను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో పని చేశానని అన్నారు.
పార్టీ కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు శివరామరాజు. ఉండి సీటు ప్రకటించే ముందు తెలుగుదేశం పార్టీ కనీసం తనను సంప్రదించకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఎన్నికల వేళ వేరే పార్టీలో చేరడం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయంపై శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తానని చెప్పారు.
పోటీ చేయాలని అన్ని పార్టీల్లోని రైతాంగం, కార్యకర్తలు తనను కోరుతున్నారని చెప్పుకొచ్చారు శివరామరాజు. ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగేది లేదని స్పష్టం చేశారు. ఉండి నియోజక వర్గంలో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. ఎన్నికల వేళ ఉండి నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు టీడీపీకి తలనొప్పిగా మారింది.
Also Read : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
