Andhra Pradesh High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.
- Naveen
- Published On : August 4, 2022 / 04:24 PM IST
Andhra Pradesh High Court
Andhra Pradesh High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టు తరలింపుపై తమకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు ఏవీ అందలేదని వెల్లడించింది.
ఈ విషయంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని ఆ తర్వాతే కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్రం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు లోక్ సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందన్నారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వమే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని ఆయన చెప్పారు.
‘అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయం కేంద్రం వద్ద పెండింగ్లో లేదు. హైకోర్టు ఎక్కడున్నా దాని నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టునే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు తరలింపుపై ఇటు హైకోర్టుతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది’ అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
