తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ని పదేళ్లు ఎందుకు పెట్టారని చంద్రబాబుని ప్రశ్నించిన వంశీ, పురిటి వాసన పోని ప్రభుత్వంపై అప్పుడే దీక్షలు, ఉద్యమాలు అంటూ తెలుగుదేశం పార్టీ బయల్ధేరిందని అన్నారు వంశీ.
నలభై ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించట్లేదని అన్నారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణాలను ఎన్ని రోజుల్లో మాఫీ చేశారో అందరికీ తెలుసు కదా? జగన్ ప్రభుత్వాన్ని మాత్రం అన్ని ఒకేసారి చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు.
వర్షాలు, వరదలు ఉన్నప్పుడు ఇసుకను ఎలా తీయొచ్చో చెప్పండి. అటువంటి టెక్నాలజీ ఉంటే సెల్ ఫోన్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి అని ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వం అయినా మంచి పని చేస్తే కచ్చితంగా సపోర్ట్ చేయాలని అందుకే జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు వల్లభనేని వంశీ.
ఎన్నికలకు ముందు ఒక మాట.. తర్వాత ఒక మాట చెప్పడంతో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు నమ్మకం పొయ్యిందని అన్నారు వల్లభనేని వంశీ. 2019లో ప్రజలు కచ్చితమైన తీర్పు ఇచ్చారు అని ప్రభుత్వం చేసే మంచి పనులను ఎందుకు అంగీరించట్లేదని ప్రశ్నించారు. ఎద్దొచ్చి చేలో పడినట్లు.. ప్రతి విషయాన్ని గుడ్డిగా ప్రశ్నిస్తే ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అని అన్నారు వల్లభనేని వంశీ.
అప్పుడు పుత్ర రత్నం కానీ, భజన పరులు కానీ టైటానిక్లా పడవలా మునిగిపోయే తెలుగుదేశం పార్టీని కాపాడలేరని అన్నారు.మొన్న గోదావరిలో పడవను ధర్మాడి సత్యం తీశారు. తెలుగుదేశంను మాత్రం ఎవరూ తియ్యలేరు అని అన్నారు. అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఒక పార్టీలో ఉండి చెప్పేవాళ్లను చంద్రబాబు నమ్ముతారని, ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిగా పోటీ చేసి పార్టీ అధికారంలోకి వచ్చిందా? అని విమర్శించారు వల్లభనేని వంశీ.