ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ సై అంటే సై అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట మున్సిపల్ ఆఫీసుల వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేశవరంలో తోట త్రిమూర్తులు అక్రమంగా గ్రావెల్ తవ్వవాలు చేపట్టారని ఇటీవల వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తేల్చుకోవడానికి గ్రామ ప్రజలతో ప్రైవేటు ఎన్నిక ఏర్పాటు చేద్దామని అన్నారు. నిన్న మండపేట మున్సిపల్ ఆఫీసు వద్ద వారిద్దరు దీనిపైనే మాట్లాడారు.
ఎన్నికకు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని వారిద్దరు తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో ప్రైవేటు ఎన్నికలో ఓడిపోయినవారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వారిద్దరు నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీల అధిష్ఠానంతో ఈ మేరకు ప్రకటన చేయించాలని అన్నారు. మీడియా సమక్షంలో ఓటింగ్ జరగాలని చెప్పారు.
ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నిక ఉంటాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రూల్స్ రూపొందించాక మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెళ్లిపోయారు.