Vijayawada Durga Temple : ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కరోనా లాక్డౌన్ వేళల్లో మార్పులు చేసిన దృష్ట్యా ..విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం వేళలు పెంచినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11:30 నిమిషాల వరకు ఉన్న దర్శన సమయాన్ని, మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పెంచారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కోన్నారు.
ఉదయం గం.11.45 గం.ల నుండి మధ్యాహ్నం గం. 12.15 గం. ల వరకు శ్రీ అమ్మవారి మహా నైవేద్యం కొరకు దర్శనం నిలుపుదల చేయనున్నారు. దేవస్థానము నందు శ్రీ అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ పరోక్ష సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నది. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు నిత్య ఆర్జిత సేవల యందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవి.
భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణము, మృత్యుంజయ హోమము, గణపతి హోమం, శ్రీచక్రనవావర్ణార్చన సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామములతో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగిందని… భక్తులు ఆన్లైన్ ద్వారా ఈ సేవల్లో పాల్గోనవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.