×
Ad

ఈ విషయాన్ని తీవ్రతరం చేశారు.. ఇకపై..: మోహన్ బాబు వర్సిటీ గురించి వస్తున్న వార్తలపై మంచు విష్ణు ఫుల్ క్లారిటీ

"మా ఛాన్సలర్ డాక్టర్ ఎమ్.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము" అని చెప్పారు. 

Manchu Vishnu

Vishnu Manchu: మోహన్ బాబు యూనివర్సిటీ గురించి వస్తున్న వార్తలపై ఆ వర్సిటీ ప్రో-ఛాన్సలర్, సినీనటుడు విష్ణు మంచు స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేసి పూర్తి వివరాలు తెలిపారు.

“మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

అవి కేవలం సిఫార్సులు మాత్రమేనని, ఆ సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్ – జ్యుడిస్) ఉన్నాయని దయచేసి గమనించాలి. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC సదరు సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును హైకోర్టు జారీ చేయగా, APHERMC కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం.

Also Read: కాంగ్రెస్‌లో ”దున్నపోతు” కామెంట్స్ దుమారం.. మంత్రుల మధ్య వైరం ఎందుకు? కారణం అదేనా?

APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది. ఈ విషయంపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉంది. విషయాన్ని తీవ్రతరం చేసి, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా సెలెక్టెడ్‌ సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు, మా భాగస్వాములందరికీ తెలియజేస్తున్నాము.

మోహన్ బాబు విశ్వవిద్యాలయం నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తూ, రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోంది. గత కొన్నేళ్లుగా, MBU ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు, వేతన ప్యాకేజీలను స్థిరంగా సాధిస్తోంది. ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు. 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించబడినప్పటి నుంచి, ఈ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది.

ఎంతోమందికి ఉచిత విద్యను అందించడం, సాయుధ దళాలు, పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్‌షిప్పులు ఇవ్వడం, అనాథలను దత్తత తీసుకుని వారికి పూర్తి విద్య, సంరక్షణ అందించడం వంటివి చేస్తోంది. విద్య, సమాజ సేవలో మా సహాయ సహకారాలు బహిరంగ రికార్డులలో ఉన్నప్పటికీ, దురుద్దేశంతో కొంతమంది పదే పదే మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు.

మా అకడమిక్ శ్రేష్ఠత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తున్నది. QS 100 ర్యాంకు పొందిన పెన్ స్టేట్ యూనివర్సిటీ (USA)తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామును ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయం MBU. మాకు RWTH ఆకెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ), విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (USA)తో కూడా అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు భారతదేశంలో తమ డిగ్రీలను కొనసాగిస్తూనే విదేశీ యూనివర్శిటీలలో సెమిస్టర్, పరిశోధన కార్యక్రమాలను అభ్యసించడానికి వీలు కలుగుతుంది.

కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎమ్.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము” అని చెప్పారు.