Viveka Murder Case: చంద్రబాబు చేతిలో పావులుగా వివేకా కూతురు.. కుట్రలు చేస్తున్నారు

టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Updated on- March 1, 2022 / 06:06 PM IST

Sajjala Ramakrishna Reddy

Viveka Murder Case: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు సజ్జల.

వివేకా హత్య కేసులో సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని, ఈ కుట్ర పరాకాష్టకు చేరిందని అన్నారు సజ్జల. వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయపరమైన కుట్ర జరుగుతుందని, చంద్రబాబు కనుసన్నల్లో ఈ కుట్ర అంతా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి మాట్లాడిన తర్వాత కూడా మౌనం వీడకపోతే కరెక్ట్ కాదని, చంద్రబాబు జగన్నాటకంలో వివేకా కుమార్తె సునీతరెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డి పావులు అని అన్నారు. ఏమాత్రం ఆధారాల్లేకుండా సునీత ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె, అల్లుడిని కలుపుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ విచారణను గతంలో ప్రభుత్వం కూడా స్వాగతించిందని, చంద్రబాబు మాదిరిగా సీబీఐకి నో ఎంట్రీ అని చెప్పలేదని అన్నారు. వివేకా హత్యపై రోజుకో ఆరోపణ చేస్తూ.. ఎల్లో మీడియా దిగజారుడు కథనాలు రాస్తోందని చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రే ఇదియని అన్నారు.

ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కుట్ర పూరితంగా వెనకుండి చంద్రబాబే నాటకాలు ఆడిస్తున్నారని అన్నారు. సిగ్గూ, ఎగ్గూ లేకుండా కథలు, కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.