హనుమంతుడు ఎక్కడ పుట్టాడు ?

  • Publish Date - November 7, 2020 / 06:13 PM IST

Where was Hanuman born? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్‌లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్‌లో అని ఇంకొకరు చెబుతున్నారు. ఇప్పుడు.. మన తిరుమల గిరుల్లోనే ఆ పవనసుతుడు జన్మించాడనే కొత్త చర్చ మొదలైంది. జాపాలి తీర్థమే.. ఆంజనేయుడి జన్మస్థలి అంటున్నారు.



ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు హనుమంతుడి జన్మస్థలంపై కొత్త చర్చ మొదలైంది. తిరుమల గిరుల్లోనే.. ఆంజనేయుడు జన్మించాడని.. ఈ ప్రాంతాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని భక్తులు, కొందరు చరిత్రకారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో.. రామభక్తుడు హనుమంతుడు.. ఎక్కడ జన్మించాడో తేల్చాలని టీటీడీ ఆదేశించింది. ఈ మేరకు.. పురాణాలు, ఇతర గ్రంథాలను పరిశోధించాలని.. టీటీడీ ఈవో జవహార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో.. ఆంజనేయుడి జన్మస్థలిపై అంతటా ఆసక్తి పెరిగింది.



తిరుమలలో జాపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతున్నారు కొందరు. ఇదే విషయమై.. శ్రీ హనుమ జన్మస్థలం-అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్ జీ హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికమైందని.. స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా తన పుస్తకంలో తెలిపారు.



వానర వీరుడు, వాయుదేవుని సుతుడు, పరమ రామభక్తుడు.. హనుమంతుడు పుట్టిన స్థలంపై వివాదం ఈనాటిది కాదు. మారుతి జన్మస్థలిగా.. దేశంలో చాలా ప్రదేశాలు.. పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అంజనీదేవి.. బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ.. వివిధ ఆలయాల్లో నిత్యం పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. అలా.. ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర తిరుమల క్షేత్రంలోని జాపాలి తీర్థం కూడా ఒకటి. పవనసుతుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి.



తిరుమల ఏడుకొండల్లో ఒకటైన.. అంజనాద్రిపై వెలిసిన జాపాలి దగ్గర హనుమంతుడు పుట్టినట్లు కొన్ని స్థల పురాణాల్లో ఉంది. అంజనీదేవి.. ఆంజనేయుడికి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే.. ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కిందని ఇతిహాసం. ఇక్కడి అటవీ ప్రాంతంలో పురాతన ఆంజనేయ ఆలయం ఉంది. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. జాపాలిలో హనుమంతుడి దర్శనం చేసుకుంటారు.