Y.s.vijayamma
Y.S.Vijayamma: మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సమావేశానికి ఆహ్వానం పంపారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు ఆహ్వానాలు కూడా అందినట్లుగా తెలుస్తుంది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలపగా వైఎస్ హయాంలో పనిచేసిన మంత్రులతో పాటు సహచరులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.
మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్తోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా విజయమ్మ స్వయంగా ఫోన్చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. 2009లో వైఎస్ఆర్ చనిపోగా ఇప్పటి వరకు ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఇదే ఇప్పుడు పలు రాజకీయ ఊహాగానాలకు అవకాశంగా మారింది.
వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెల్లి షర్మిల తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతుండగా ఇలాంటి సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయమ్మ భర్త వర్ధంతి రోజున సమావేశానికి ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆవిర్భావ సభలో కూడా విజయమ్మ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేయగా ఇప్పుడు ఆహ్వానం పంపిన వారిలో ఎక్కువ శాతం ఆ పార్టీ నేతలే ఉన్నారు. మరి ఈ సమావేశం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించనుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ షర్మిల పార్టీని బలోపేతం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఎజెండాగా రాజకీయ వర్గాలలో సహజంగానే ఒక ప్రచారం మొదలవగా ఈ సమావేశం ఫలితం ఎలా ఉండనుందన్నది ఆసక్తిగా మారింది.