ద్వారంపూడి ఇంటి ముట్టడి : జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి

  • Publish Date - January 12, 2020 / 07:45 AM IST

జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో భానుగూడి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. కొందరి చొక్కాలు చిరిగిపోయాయి. ఘటనలో జనసేన కార్యకర్తలు, పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పాలని జనసేన డిమాండ్ చేస్తోంది. 

మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని జనసేన ఖండించింది. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించాలని జిల్లా జనసేన నేతలు నిర్ణయించారు.

 

2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఉదయం భారీగా జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ర్యాలీగా బయలుదేరి ద్వారంపూడి ఇంటిని వైపు కదిలారు. అప్పటికే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తలపై ఒక్కసారిగా దాడులకు పాల్పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో వారిని తరిమితరిమికొట్టారు.

అక్కడనే ఉన్న పోలీసులు ఏమి చేయలేక చేతులేత్తేశారు. ప్రాణభయంతో సమీపంలో ఉన్న దేవాలయంలోకి వెళ్లి దాక్కున్నామని, ఎమ్మెల్యే అనుచరులు ఇలాగేనా వ్యవహరించేది అంటూ ప్రశ్నిస్తున్నారు జనసేన లీడర్స్. ఈ ఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఎలా స్పందిస్తారో చూడాలి. 

Read More : చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం : ఎద్దు పొడిచి యువకుడు మృతి