విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెప్పగలరా బాబు : అంబటి

  • Publish Date - February 27, 2020 / 12:43 PM IST

చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు. వీటిపై స్పందించిన అంబటి రాంబాబు గురువారం (ఫిబ్రవరి 27, 2020) మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని.. వారు వ్యవహరించిన తీరు సరైనదేనని అన్నారు. ఈ రోజు విశాఖలో పోలీసుల తీరు అద్భుతం అన్నారు.

ఏపీ అభివృద్ధి కావాలని టీడీపీ కోరుకోవడం లేదని అంబటి అన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు హారతిపడతారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంతో నిరసన తెలిపితే పులివెందుల నుంచి వచ్చారని ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రకు వెళ్లి విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెప్పగలరా అని అన్నారు. అలా చెబుతే శాంతిభద్రతల సమస్య రాదా అని అన్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ సృష్టించి లబ్ధి పొందాలనే ప్రజా చైతన్య యాత్రను చంద్రబాబు ప్రారంభించారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే పనులను చంద్రబాబు మానుకోవాలని హితవుపలికారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులని అభివర్ణించారు. 

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ‘చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నేడు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి.. బాబు కుళ్లుబుద్ధికి మధ్య పోరాటం జరుగుతోంది. వైజాగ్ వెళ్లి అమరావతి జిందాబాద్ అంటూ రెచ్చ గొడుతున్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని చెపితే చంద్రబాబును మేళతాలాలతో స్వాగతిస్తారా..? ఉత్తరాంధ్ర నాశనం చేస్తానంటే అక్కడ ప్రజలు స్వాగతిస్తారా..? చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపేశారు’ అని అంబటి తెలిపారు.

అమరావతి రాజుగారు ఉత్తరాంధ్ర మీద దండయాత్రకు వెళ్లి నట్లు చంద్రబాబు వెళ్లారని ఎద్దేవా చేశారు. గతంలో హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలికి వెళ్తే ఎయిర్ పోర్ట్ నుంచి జగన్‌ ను బయటకు రానివ్వలేదన్నారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు వస్తే రన్‌వే మీద అడ్డుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.