YS Jagan: క్రాంతికుమార్ మరణం దారుణం.. సీసీ ఫుటేజ్ ఎలా డిలీట్ అయ్యింది.. కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం
టాక్సీ డ్రైవర్ క్రాంతికుమార్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్రంగా స్పందించారు.
- V Santhosh Kumar
- Published on- July 2, 2026 / 02:06 PM IST
YS Jagan sensational comments against ap government regarding the suicide of Vijayawada taxi driver Kranthi Kumar.
- క్రాంతికుమార్ ఆత్మహత్య తీవ్ర ఘోరం
- ఖాకీల వేధింపులపై జగన్ ఫైర్
- సీసీటీవీ ఫుటేజ్ మాయం దారుణం
YS Jagan: విజయవాడలో పోలీస్ వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టాక్సీ డ్రైవర్ క్రాంతికుమార్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. పేదరికంలో బతుకుతున్న ఒక చిన్న కుటుంబాన్ని ఈ వ్యవస్థ ఎలా అన్యాయంగా చినాభిన్నం చేసిందో ఈ ఘోరమే సాక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థల రక్షణ.. బాధితులకు అన్యాయం:
గత ఎనిమిదేళ్లుగా క్రాంతికుమార్పై ఎలాంటి కేసులు లేవని, పాత కేసులను కూడా కోర్టు కొట్టివేసిందని జగన్(YS Jagan) ఈ సందర్బంగా గుర్తుచేశారు. గౌరవంగా టాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్న వ్యక్తిని రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేశారని ధ్వజమెత్తారు. క్రాంతికుమార్ చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియో రికార్డైనా, దానిని బాధితుడి తండ్రి స్వయంగా సీపీకి చూపించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారని జగన్ ఆరోపించారు.
సీసీ ఫుటేజ్ మాయం.. బాధితులకు వైఎస్సార్సీపీ అండ:
పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఫుటేజీని ఎలా తొలగిస్తారని జగన్ ప్రశ్నించారు. నెల రోజుల్లోనే లాకప్ డెత్, సూసైడ్ ఘటనలు జరగడం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. మరణ వాంగ్మూలం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు. క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపరమైన పోరాటానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
