జగన్ ప్లాన్ వేశారు.. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గం: ముంబై నటి వ్యవహారంపై షర్మిల  

ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ కాదంబరికి జరిగిన అన్యాయంపై ఎందుకు..

ముంబై నటి కాదంబరి జత్వానీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జత్వానీని ఎలా కట్టడి చెయ్యాలనే విషయంపై సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ వేశారని చెప్పారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గమని, ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్లు వేశారని చెప్పారు.

జత్వానీ ఒక మహిళా డాక్టర్ అని, ఆమెను మానసిక వేదనకు గురిచేశారని వైఎస్ షర్మిల అన్నారు. యాక్టింగ్ ఫీల్డులోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని తెలిపారు. ఆమె సామాన్యురాలైతే వంద కోట్ల రూపాయలు ఇచ్చి నొక్కి పెట్టేసేవారని ఆరోపించారు. జత్వానీకి అండగా పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని వైఎస్ షర్మిల చెప్పారు. జగన్‌కు తెలియకుండానే ఐఏఎస్, ఐపీఎస్‌లు కాదంబరి జత్వానీని అరెస్ట్ చేశారా అని నిలదీశారు. ఆమె వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలని, ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ కాదంబరికి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.

Also Read: బీజేపీ నిజస్వరూపం బయటపడింది.. ఆ ఇద్దరు సమాధానం చెప్పాలి: వీహెచ్

ట్రెండింగ్ వార్తలు