Sajjala Ramakrishna Reddy (Photo : Google)
Sajjala Ramakrishna Reddy – Pawan Kalyan : ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రతిపక్షాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని అవాంఛనీయ ఘటనలను పట్టుకుని.. రాష్ట్రం మొత్తం ఏదో జరుగుతోందని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు సజ్జల. పవన్ కల్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని, పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నారుని ఆరోపించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
” ఏపీలో జరుగుతున్న సంక్షేమం గురించి మాట్లాడలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు, అవకాశం ఉండి కూడా పేదలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ప్రతి పథకం అందరికీ అందాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం. హక్కు కలిగి ఉండి.. పథకాలు అందని లబ్ది దారులకు.. ఈ నెల రోజుల్లో 100శాతం అందేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తూ గడప గడపకు తిరుగుతున్నారు.
ఎమ్మెల్యేలను ఎవరూ ఒత్తిడి చేయడం లేదు. చంద్రబాబు ఏ స్లోగన్ ఇస్తే పవన్ ది కూడా అదే స్లోగన్. రోజుకో మాట చెబుతున్న పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. శాంతి భద్రతల విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. ఊరు పేరు లేని పార్టీలు కూడా శాంతి భద్రతల గురించి మాట్లాడం ప్లాన్ లో భాగమే. ఏపీలో సమస్యలు లేవు కాబట్టి శాంతి భద్రతల సమస్య అంటూ హడావుడి చేస్తున్నారు.
విశాఖ మీద ఉన్న కడుపు మంటను ఎంపీని అడ్డుపెట్టుకుని తీర్చుకుంటున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ కి వెళ్లిపోతా అని ఎక్కడా చెప్పలేదు. కులాల మధ్య చిచ్చు పెడితే వారికే బూమ్ రాంగ్ అవుతుంది. ముద్రగడ నిజాయితీగా కాపుల కోసం పోరాటం చేశారు. తన కులాన్ని తన స్వార్ధం కోసం ఎప్పుడూ వాడుకోలేదు. నిబద్ధతతో పని చేసే వారికి వైసీపీలో స్థానం ఉంటుంది.
ముద్రగడ వెనుక వైసీపీ లేదు. పార్టీలకు అతీతంగా ముద్రగడ పోరాటం చేస్తున్నారు. ముంబైలో ఎకరం అమ్మితే హైదరాబాద్ లో కూడా 100 ఎకరాలు కొనుక్కోవచ్చు. న్యూయార్క్ లో ఎకరం అమ్మితే ముంబైలో 100 ఎకరాలు కొనొచ్చు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ మరోసారి చెప్పారు” అని సజ్జల అన్నారు.
” జగనన్న సురక్ష కార్యక్రమంతో పాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్తున్నాం. టీడీపీ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయలేదు. ఈ కార్యక్రమం చంద్రబాబు, పవన్ కల్యాణ్కు మింగుడు పడటం లేదు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవు” అని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
”ముద్రగడ పద్మనాభం నిజాయితీపరుడు. తన కులం కోసం బలంగా నిలబడిన వ్యక్తి. ఎన్నో రాజకీయ త్యాగాలు చేశారు. నమ్మిన దానిపై నిలబడ్డ నాయకుడు. కులాన్ని ఎప్పుడూ వాడుకోలేదు. నిజాయితీగా పని చేశారు. కాపులకు న్యాయం చేసేందుకు ముద్రగడ నిలబడ్డారు. అలాంటి ముద్రగడ వెనుక వైసీపీ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?” అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.