ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడంపై ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు వైసీపీ నేతలు. మండలి చైర్మన్ షరీఫ్ పై విమర్శలు వర్షం
ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడంపై ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు వైసీపీ నేతలు. మండలి చైర్మన్ షరీఫ్ పై విమర్శలు వర్షం కురిపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రూల్ 71 ఎక్కడా లేదని.. ఒక్క ఏపీ మండలిలో మాత్రమే ఉందని మండిపడ్డారు.
రెండు బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. అసలు రూల్ 71 అనేది దేశంలోనే ఎక్కడా లేదన్నారు మంత్రి బుగ్గన. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు. ఆ రూల్ కూడా కేవలం ప్రభుత్వం పంపించే బిల్లులపై సమీక్షించేందుకే వినియోగించాలని చెప్పారు. కాని, టీడీపీ మాత్రం రూల్ 71 ఉపయోగించి బిల్లును అడ్డుకుందని విమర్శించారు.
మండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మంత్రి బుగ్గన. టీడీపీ అధినేత చంద్రబాబు సూచించిన విధంగా మండలి చైర్మన్ నడుచుకున్నారని విమర్శించారు. మండలి గ్యాలరీలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు కూర్చుని చైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. మరోవైపు మండలి చైర్మన్ చట్టానికి, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలన్నారు మంత్రి బొత్స. అలా కాకుంటే అది జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఇటు టీడీపీని మాత్రం రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. దీని వల్ల బిల్లు ఆమోదం పొందడంలో కాస్త జాప్యం మాత్రమే జరుగుతుందన్నారు. అంతేగానీ టీడీపీ సాధించేదేమీ ఉండదని స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివని మండిపడ్డారు బొత్స. మొత్తానికి రెండు రోజులు మండలిలో పోరాడినా ఫలితం దక్కకపోయేసరికి వైసీపీ నేతల్లో అసహనం పెల్లుబికింది. దీంతో చైర్మన్పై కూడా మాటల యుద్ధానికి దిగారు.
Also Read : ఏపీ శాశ్వత రాజధాని అమరావతే : విలీనం..విలీనం అనొద్దని పవన్ సీరియస్