ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్లు పెడుతున్నారంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, ఉండవల్లి శ్రీదేవిలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు తీరు మారట్లేదని విమర్శించారు. చంద్రబాబు వికృత చేష్టలకు దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కూడా జగన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ వంటి నేతలు చనిపోయినట్లు ఆరోపించారు జోగి రమేష్.
ఇదే సమయంలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైఎస్ జగన్ కుటుంబంపై టీడీపీ చేస్తున్న విషప్రచారం కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే అయిన తనపై దాడి చేశారని, పెయిడ్ ఆర్టిస్ట్లతో మంత్రులను తిట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టారని అన్నారు.
నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు శ్రీదేవి. సీఎం జగన్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీ విమర్శిస్తుందని, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు పెడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.