AP Elections 2024 : వామ్మో.. రోజుకు రూ.10 నుంచి 20లక్షలు..! ఆ భయంతో కనిపించకుండా తిరుగుతున్న అభ్యర్థులు

ఎక్కువ మంది నేతల వైఖరి చూస్తుంటే ఉగాదిపై నెపం మోపి తప్పించుకుంటే ఈ నెల రోజుల ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది.

Election Campaign Expenses

AP Elections 2024 : ఎన్నికలు అంటే ఆ హడావుడే వేరబ్బ… ప్రచారం, పాదయాత్ర, ర్యాలీలు, బహిరంగ సభలు అబ్బో ఒకటేంటి నేతల హంగామా అంతా ఇంతా కాదు.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలతో నేతలు క్షణం ఖాళీ లేకుండా గడపుతారు. ఇక ఎన్నికల తేదీ విడుదలైందంటే.. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వారికి అసలు సమయమే సరిపోదు.

కానీ, ఈ ఎన్నికల ట్రెండ్‌ చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. బిజీబిజీగా ఉండాల్సిన నేతలు.. బిందాస్‌గా గడపుతున్నారు. సమయం చాలా ఉంది.. ప్రచారానికి కాస్త విరామం ఇచ్చేద్దామంటూ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు.

ఆ భయంతో కనిపించకుండా తిరుగుతున్న లీడర్లు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమైంది. కానీ, ఎక్కడ వారు అక్కడే.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు దక్కించుకున్న వారు.. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేదు.. ప్రధాన పార్టీల నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు అంతా కార్యకర్తలను చూస్తేనే హడలిపోతున్నారు. పది మంది కార్యకర్తలు వస్తే.. అమ్మో అంటూ భయపడితున్నారట. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉండటంతో ఇప్పటి నుంచి ఖర్చు భరించలేమంటూ కొందరు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు.

ఏడాది కాలంగా ఏపీలో ఎన్నికల వాతావరణమే..
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. షెడ్యూల్‌ విడుదలైనంతవరకు.. నేడో రేపో ఎన్నికలు అన్నట్లు ప్రజల్లో తిరిగిన నేతలు అంతా ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. పార్టీలు కూడా గతంలో ఎప్పుడూ లేనట్లు షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి. అధికార వైసీపీ గతేడాది డిసెంబర్‌ నుంచి అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టగా, ప్రతిపక్ష పార్టీలు కూడా దాదాపు అప్పటి నుంచే గెలుపుగుర్రాల కోసం అన్వేషించాయి. అంతేకాదు దాదాపు ఏడాది కాలంగా ఏపీలో ఎన్నికల వాతావరణమే కనిపించింది.

ఖర్చు భరించలేమనే భయం..
సీఎం జగన్‌ వరుసగా జిల్లాల పర్యటనలతో హోరెత్తించగా, క్యాడర్‌ కూడా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో గడపగడపకు కార్యక్రమంతో ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజల్లోకి పంపారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌, జనసేనాని పవన్‌ రకరకాల యాత్రలతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా సభలతో హడావిడి చేశాయి. మొత్తంగా చెప్పాలంటే ఎప్పుడు చూసినా ఏపీలో ఎన్నికల వాతావరణమే కనిపించేది. కానీ, షెడ్యూల్‌ విడుదలయ్యాక మాత్రం నాయకుల్లో ఆ హంగామా కనిపించడం లేదు. టికెట్ దక్కించుకున్న నేతలు సైతం రెండు నెలల సమయం ఉండటంతో ఖర్చు భరించలేమనే భయంతో దూరంగా దూరంగా ఉంటున్నారు.

దాదాపు 60 రోజుల గ్యాప్‌ రావడంతోనే పెద్ద చిక్కు వచ్చిపడినట్లైంది.
ఎన్నికలు అంటేనే భారీ ఖర్చు. ప్రాంతాలు బట్టి ఒక్కో నియోజకవర్గంలో రోజుకు పది నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ప్రచారానికి వచ్చే కార్యకర్తలతోపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి మందు, విందు సమకూర్చాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల రాజకీయ కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. జనం ఎక్కువగా వస్తున్నారనే.. ప్రజల్లో పట్టు ఉందని బిల్డప్‌ క్రియేట్‌ చేసుకోడానికి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయాల్సి వుంటుంది.

అయితే ఈ ఖర్చుకు వెనకాడని వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనా.. ఈసారి షెడ్యూల్‌ విడుదల నుంచి ఎన్నికల తేదీకి దాదాపు 60 రోజుల గ్యాప్‌ రావడంతోనే పెద్ద చిక్కు వచ్చిపడినట్లైంది. కోడ్‌ కూయడంతో ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, డబ్బు తరలింపుపై నిఘా పెరిగిపోవడంతో డబ్బు ఖర్చు చేస్తే.. కీలక సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని దాదాపు అన్ని పార్టీల నేతలు సైలెంట్‌ అయిపోయినట్లు చెబుతున్నారు.

ముహూర్తం కుదరలేదని తప్పించుకుంటున్నారు..
ప్రస్తుతం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒకరో ఇద్దరు నేతలు తప్ప ఏ ఒక్కరూ ప్రచారం మొదలుపెట్టలేదు. కొద్దిమంది మాత్రం కార్యకర్తలను కలుస్తూ జాగ్రత్త పడుతున్నా ఖర్చు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. సీట్లు ఖరారైన వారు ప్రచారం మొదలుపెట్టాలని అధిష్టానం ఒత్తిడి చేస్తున్నా, కార్యకర్తలు బలవంతపెడుతున్నా.. ముహూర్తం కుదరలేదని ఎక్కువ మంది తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఉగాది వరకు మంచిది కాదని.. ఏప్రిల్‌ 9న తెలుగు సంవత్సరాది కావడంతో ఆరోజు ప్రచారం ప్రారంభిస్తే మంచిదనే కారణంతో తప్పించుకుంటున్నారు.

ఉగాది పేరుతో నెల రోజుల ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచన..
ఏపీలో మే 13న పోలింగ్‌ జరగనుండగా, ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఎక్కువ మంది నేతల వైఖరి చూస్తుంటే ఉగాదిపై నెపం మోపి తప్పించుకుంటే ఈ నెల రోజుల ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి నిన్నమొన్నటి వరకు హడావిడి చేసిన వారు ఇప్పుడు సైలెంట్‌గా ఉండటమే హాట్‌టాపిక్‌ అవుతోంది.

Also Read : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?

 

ట్రెండింగ్ వార్తలు