టీడీపీ, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన పలువురు నేతలు
రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి, ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ సహా పలువురు నేతలు వైసీపీలోకి వచ్చారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 26, 2024 / 07:06 PM IST
TDP, Janasena Leaders joins YCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి పలువురు సీనియర్ నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి, ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ సహా పలువురు నేతలు వైసీపీలోకి వచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నేత మస్తాన్ యాదవ్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.
విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు.
విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్ను కలిసిన యలమంచిలి రవి
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీనియర్ నాయకుడైన ఆయన కొంతకాలంగా సైలెంటుగా ఉన్నారు. తాజాగా సీఎం జగన్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ మాగంటి బాబు గుడ్ బై?
