సకల శుభాలూ చేకూర్చే శాంకరీ దేవి.. ఈ పీఠం మహిమ ఏంటో తెలుసా?
అక్కడ అమ్మవారు శాంకరీ దేవిగా వెలసింది. అమ్మవారి తొలి రూపం శాంకరి.
- T Venkateshwarlu
- Published On : September 16, 2025 / 05:00 AM IST
shankari devi temple
Shankari Devi: దక్షుడి కుమార్తెగా జన్మించిన ఆదిపరాశక్తి (సతీదేవి).. పరమేశ్వరుడిని వరించింది. దక్షుడు చేస్తున్న యాగానికి తమకు ఆహ్వానం లేకున్నా వెళ్లింది. దీంతో పరమేశ్వరుడిని దక్షుడు నిందించాడు. ఆదిపరాశక్తి తట్టుకోలేక అగ్నిప్రవేశం చేసింది.
అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోక కల్యాణార్థం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదిస్తాడు.
ఆ శరీర ఖండాలు పలు ప్రదేశాలలో పడి 51 శక్తి పీఠాలుగా వెలిచాలి. వాటిలో 18 క్షేత్రాలనే అష్టాదశ శక్తి పీఠాలని అంటారు. వాటిలో అమ్మవారి తొడల మధ్యభాగం శ్రీలంకలోని ట్రింకోమలిలో పడింది. (Shankari Devi)
అక్కడ అమ్మవారు శాంకరీ దేవిగా వెలసింది. అమ్మవారి తొలి రూపం శాంకరి. శాంకరీ దేవిని పూజిస్తే సకల శుభాలూ చేకూరతాయని హిందువుల నమ్మకం. శివుడి ఆనతితో శాంకరీ ఆలయాన్ని పార్వతీ దేవికి ఓ రాజభవంతిలా విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడని చెబుతుంటారు.
ఈ ఆలయంలో అమ్మవారిని పురాతన కాలం నుంచి పూజిస్తున్నారు. క్రీస్తుపూర్వం 300లో యువరాజు విజయ్ శ్రీలంకకు రాకముందే ఈ ఆలయంలో పూజలు జరిగేవని కొందరు చెబుతుంటారు. సందర్శకులు ఆలయంలో శాంతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇది భక్తి, దైవిక శక్తికి చిహ్నమని భావిస్తారు. ఈ ఆలయాన్ని రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
