Anil Ambani : అనిల్ అంబానీకి సెబీ షాక్.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా..!
Anil Ambani : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ... ప్రస్తుతం ఏం చేసినా చేతికి షాక్ కొడుతోంది. రుణాల ముసుగులో నిధులు మళ్లించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో సెబీ చర్యలు చేపట్టింది.
- Sreehari A
- Published On : August 23, 2024 / 09:00 PM IST
Anil Ambani, 24 Others Banned From Securities Market By SEBI For 5 Years
Anil Ambani : అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షాక్ ఇచ్చింది. నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఆయనపై ఏకంగా ఐదేళ్ల పాటు నిషేధం విధించడంతో పాటు 25 కోట్ల జరిమానా విధించింది. రుణాల ముసుగులో నిధులు మళ్లించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అనిల్తోపాటు మరో 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. దీంతో అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. భారీ కరెక్షన్తో ఆర్కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్లో ఇవాళ ట్రేడింగ్ను నిలిపివేశారు.
Read Also : Poco Pad 5G Launch : పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ… ప్రస్తుతం ఏం చేసినా చేతికి షాక్ కొడుతోంది. రుణాల ముసుగులో నిధులు మళ్లించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో సెబీ చర్యలు చేపట్టింది. అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో కీలకంగా వ్యవహరించిన అధికారులు, మరో 24 సంస్థలపై ఐదేళ్ల నిషేధం విధించింది.
అలాగే, రిలయన్స్ హోమ్స్ ఫైనాన్స్ను ఆరు నెలల పాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించి ఆరు 6లక్షల జరిమానా విధించింది. ఇక అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. అంతేకాదు… సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది. ఈ నిషేధం ఐదేళ్లపాటు కొనసాగనుంది. సెబీలో రిజిస్టర్ అయిన సంస్థల్లో డైరెక్టర్, ఇతర కీలక పదవుల్లో ఉండొద్దని సెబీ ఆదేశించింది.
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో సెబీ బాధ్యులపై చర్యలు తీసుకుంది. 222 పేజీల ఫైనల్ నివేదిక విడుదల చేసింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో RHFL నిధులను మళ్లించారని సెబీ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా చిన్న కంపెనీలు భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.
కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. RHFL డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాటిని యాజమాన్యం బేఖాతరు చేసిందని పేర్కొంది. అనిల్ అంబానీ ప్రభావంతో అధికారులు కావాలనే నిబంధనలను అతిక్రమించారని సెబీ స్పష్టం చేసింది.
రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలం కావడంతో RHFL దివాళా తీసిందని సెబీ పేర్కొంది. దీంతో పబ్లిక్ షేర్హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది. ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. మరోవైపు సెబీ నిర్ణయంతో ఇవాళ అడాగ్ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ కరెక్షన్తో పలు స్టాక్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోయింది.
Read Also : Swadesh x Falguni Shane : హైదరాబాద్లో స్వదేశ్, ఫాల్గుణి షేన్ పీకాక్ లిమిటెడ్ ఎడిషన్ దుస్తుల ఆవిష్కరణ!
