రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్రంతో సమరానికి రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడం కష్టమని ఇప్పటికే సంకేతాలిచ్చింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీయడమేనని మండిపడ్డాయి. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నాయి.
జీఎస్టీ బకాయిల కోసం సమష్టిగా పోరాడాలని నిర్ణయం:
ఈ క్రమంలో గురువారం(ఆగస్టు 27,2020) జీఎస్టీ కౌన్సిల్ 41వ సమావేశం జరగనుంది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్రాలకు బకాయిలు, పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జీఎస్టీ పరిహారం అంశంపై ఏడు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు తీవ్ర అసంతృప్తిని, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. జీఎస్టీ బకాయిల కోసం సమష్టిగా పార్లమెంట్లోనూ, బయటా పోరాడాలని నిశ్చయించారు. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని కూడా సీఎంలు ఆలోచిస్తున్నారు.
తొలి రెండు విడతల జీఎస్టీ పరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు:
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,65,302 కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం కొద్ది నెలల కిందటే చెల్లించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు విడతల పరిహారాన్ని మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ఆర్థిక మందగమనం, తగ్గిన రాబడితో రెవెన్యూ లోటు పెరగడం, కొవిడ్ను ఎదుర్కొనేందుకు ఇతర ఆర్థిక ఉద్దీపన చర్యలు తీసుకోవడం వంటి కారణాలతో ఈసారి జీఎస్టీ బకాయి చెల్లించడం సాధ్యపడదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ పాండే జూలైలో పార్లమెంటరీ స్థాయీ సంఘ సమావేశంలో చెప్పారు. వసూళ్లు తగ్గినప్పుడు బకాయిలు చెల్లించనక్కరలేదన్న విషయం జీఎస్టీ నిబంధనావళిలో ఉందని ఆయన అన్నారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రాలను దగా చేస్తుంది:
బుధవారం(ఆగస్టు 26,2020) కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 7 విపక్షపాలిత రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జీఎస్టీ విషయంపై తీవ్రంగా స్పందించారు. ‘రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించేందుకు నిరాకరించడం అంటే దేశ ప్రజలను మోడీ ప్రభుత్వం వంచిస్తున్నట్లేనని సోనియా విమర్శించారు. కేంద్రం.. రాష్ట్రాలను దగా చేస్తుందని, జీఎస్టీ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమిష్టిగా పోరాడాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. కేంద్రాన్ని చూసి భయపడదామా.. పోరాడదామా.. మనమే తేల్చుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే అన్నారు. బెంగాల్కే కేంద్రం నుంచి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందని, ఇది రాకపోతే ప్రభుత్వానెలా నడపగలమని మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ రాష్ట్రాల ఆర్థికస్థితి దయనీయంగా ఉందని అశోక్ గెహ్లోత్, జార్ఖండ్ సీఎం సొరెన్ అన్నారు.
జీఎస్టీ రేట్లను పెంచే అవకాశం?
కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కొంతైనా పరిపుష్ఠం చేసుకునేందుకు జీఎస్టీ రేట్లను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ వస్తు ఉత్పత్తులపై పన్నుల భారం మోపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టేక్కెందుకు రాష్ట్రాలు మార్కెట్ నుంచి మరింతగా రుణం తీసుకోవడానికి అనుమతించడం, బకాయి సెస్ కింద వచ్చే వస్తువుల సంఖ్యను పెంచడం.. సెస్ను పెంచడం.. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ తదితర నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.