Swiggy-Zomato : స్విగ్గీ, జొమాటోకు CMC అల్టిమేటం.. లైసెన్స్ లేని ఫుడ్ అవుట్‌లెట్లకు ‘నో ఎంట్రీ’!

Swiggy-Zomato : స్విగ్గీ, జొమాటోకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ లేదా రద్దైన లైసెన్స్ ఫుడ్ సంస్థలను కూడా పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.

Swiggy-Zomato

Swiggy-Zomato : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కఠినంగా వ్యవహరిస్తోంది. ఆహార భద్రత, ప్రజారోగ్యం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా స్విగ్గీ, జొమాటో సంస్థలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో ఈ ఆదేశాల అమలుపై కంప్లయన్స్ రిపోర్టు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.

సీఎంసీ ఆదేశాల ప్రకారం.. వ్యాలీడ్ అయ్యే FSSAI లైసెన్స్‌తో పాటు సీఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఫుడ్ సంస్థలకే స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అవకాశం కల్పించాలి. లైసెన్స్ గడువు ముగిసిన ఫుడ్ అవుట్‌లెట్లను వెంటనే డీ-లిస్ట్ చేయాలని, అలాగే సస్పెండ్ లేదా రద్దైన లైసెన్స్ ఫుడ్ సంస్థలను కూడా పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.

అంతేకాదు.. ఫుడ్ క్వాలిటీ, హైజీన్ రేటింగ్ విధానాల వివరాలను సీఎంసీకి సమర్పించాలని, కార్పొరేషన్‌తో సమాచార మార్పిడి కోసం ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించాలని సూచించింది.

వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు ఇచ్చే నెగటివ్ రివ్యూలను డిలీట్ లేదా హైడ్ చేయడం చేయరాదని స్పష్టంగా పేర్కొంది. అలాగే, ప్రతి ఫుడ్ అవుట్‌లెట్ జియో-లొకేషన్‌ను తప్పనిసరిగా వెరిఫై చేయాలని, రిజిస్ట్రర్ అయినే ప్రాంగణంలోనే ఆహారం తయారవుతుందో లేదో కన్ఫార్మ్ చేయాలని ఆదేశించింది.

Read Also : SBI Credit Card : SBI కార్డు వాడుతున్నారా? జాగ్రత్త.. ఓవర్‌డ్యూ రిపోర్టులతో క్రెడిట్ స్కోర్‌కు భారీ నష్టం!

ప్రతి ఫుడ్ సంస్థ తమ సీఎంసీ ట్రేడ్ లైసెన్స్‌ను యూజర్లకు కనిపించేలా చేయడం తప్పనిసరిగా పేర్కొంది. అదేవిధంగా, ట్రేడ్ లైసెన్స్ వ్యాలిడిటీని క్రమం తప్పకుండా చెక్ చేయాలని కూడా సూచించింది.

సీఎంసీ పరిధిలో నమోదైన అన్ని ఫుడ్ సంస్థల పూర్తి జాబితాను సమర్పించాలని స్విగ్గీ, జొమాటోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అన్ని మార్గదర్శకాల అమలుపై వారం రోజుల్లో కంప్లయన్స్ నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది.

ఆహార భద్రత, ప్రజారోగ్యం, వినియోగదారుల రక్షణే ప్రధాన లక్ష్యమని సీఎంసీ పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఫుడ్ సేఫ్టీ యాక్ట్, జీహెచ్ఎంసీ యాక్ట్ నిబంధనల ప్రకారమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.