8th Pay Commission DA Hike
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. హోలీ పండగకు ముందే డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. దాంతో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 2026 నుంచి డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు ఉంటుందని అంచనా. మార్చి మొదటి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో భారీ మార్పు ఉంటుంది. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపైనే పడింది. ఈ క్రమంలోనే డీఏ పెంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డీఏలో మార్పు కోసం కొత్త విధానం :
సాధారణంగా డియర్నెస్ అలవెన్స్ (DA) ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. మొదటి సవరణ జనవరి నుంచి అమలులోకి వచ్చి మార్చిలో ప్రకటిస్తారు. జూలై నుంచి అమలులోకి వచ్చే రెండో సవరణ పండుగ సీజన్ లేదా దీపావళి సమయంలో ప్రకటిస్తారు. ఈ ప్రక్రియను మునుపటి అన్ని పే కమిషన్లు కూడా ఫాలో అయ్యాయి. ఉద్యోగుల నెలవారీ జీతాలు, పెన్షన్లలో భారీగా మార్పులు ఉంటాయి.
డిసెంబర్ 2025 వరకు డీఏ 58 శాతంగా ఉంది. జూలై 2025లో 3 శాతం పెంపు తర్వాత నిర్ణయించారు. ఇప్పుడు, 2026 నుంచి మరో 2 శాతం పెంచే యోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే జరిగితే డీఏ 60 శాతానికి చేరుకోవచ్చు.
గత 26 ఏళ్లలో అతి చిన్న పెంపు అయినప్పటికీ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బకాయిలపై ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని అందిస్తుంది. జనవరి 2000లో కేవలం ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంది. జనవరి 2007, 2018, 2025లో 2 శాతం పెరుగుదల నమోదైంది.
8వ వేతన సంఘం :
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 3, 2025న 8వ వేతన సంఘం నిబంధనలను (ToR) జారీ చేసింది. సాధారణంగా, కొత్త వేతన సంఘం అమలు తర్వాత డీఏని ప్రాథమిక జీతంలో చేర్చుతారు. కొత్త వేతన నిర్మాణం కింద డీఏ లెక్కింపులు ప్రారంభమవుతాయి. అంటే.. ప్రస్తుత 58శాతం లేదా 60శాతం డీఏ భవిష్యత్తులో కొత్త ప్రాథమిక జీతంలో భాగం కానుంది. తద్వారా ప్రారంభ జీతంలో భారీగా మార్పులు రానున్నాయి.
ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరుగుదల :
డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు భారీగా పెరగనున్నాయి. అలాగే పెన్షనర్లకు పెన్షన్లు, బకాయిల మొత్తం అందనున్నాయి. ఇంకా, కొత్త వేతన విధానం అమలుతో ప్రారంభ ప్రాథమిక జీతంలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.