Sundar Pichai : ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ప్రతి టెక్ దిగ్గజం ఏఐ టెక్నాలజీవైపుగా అడుగులు వేస్తున్నాయి. ఏఐ బూమ్ కొనసాగుతున్న వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ ఆధారిత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ అభివృద్ధి దిశగా కొనసాగడంలో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ విశేష కృషి ఎంతో ఉంది. తాజాగా కంపెనీ నాన్-ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్గా ఆయన అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు.
సాధారణ ఉద్యోగిగా చేరి సీఈఓ స్థాయికి ఎదిగి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచిన పిచాయ్.. తన సంపదతో దాదాపు 1 బిలియన్ (100 కోట్లు) డాలర్లకు చేరువయ్యారు. తద్వారా త్వరలోనే బిలియనీర్ స్టేటస్ పొందనున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
త్వరలోనే బిలియనీర్గా పిచాయ్ :
51 ఏళ్ల పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓ అయినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 400శాతం కన్నా ఎక్కువ పెరిగింది. అదే కాలంలో ఎస్అండ్పీ 500, నాస్డాక్లను గణనీయంగా అధిగమించింది. క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్లో ఏఐ ఆధారిత వృద్ధితో కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాలు అంచనాలను అధిగమించింది. ఆ తర్వాతే గూగుల్ సరికొత్త రికార్డును తాకింది. కంపెనీ చరిత్రలో మొదటిసారిగా డివిడెండ్ను కూడా ప్రవేశపెట్టింది.
ఈ క్రమంలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కానున్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ నివేదిక పేర్కొంది. పిచాయ్ నికర విలువ ప్రస్తుత షేర్ హోల్డింగ్లలో 424 మిలియన్ డాలర్లు కాగా.. ఆయన సీఈఓ అయినప్పటి నుంచి దాదాపు 600 మిలియన్ డాలర్ల షేర్ల విక్రయాలను కలిగి ఉంది.
సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి సీఈఓగా :
సాధారణంగా కంపెనీలను స్థాపించివారు మాత్రమే నికర సంపదతో బిలియనీర్లు అవుతారు. ఒక సాధారణ ఉద్యోగి అయిన పిచాయ్.. గూగుల్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్ హోదాలో చేరి ఇప్పుడు అత్యంత ఉన్నత హోదాకు చేరుకున్నారు. అందుకే గూగుల్ సైతం పిచాయ్ సమర్థతను గుర్తించి కంపెనీ సీఈఓ బాధ్యతలను అప్పగించింది. పిచాయ్ కూడా అంతే బాధ్యతతో అన్ని టాస్కులను పూర్తిచేసి కంపెనీని విజయపథంలోకి తీసుకెళ్లారు.
పిచాయ్ జీవితం ఎలా మొదలైందంటే? :
వాస్తవానికి చిన్నతనంలో డబుల్ బెడ్ రూం అపార్ట్మెంట్లో పెరిగిన చెన్నైకి చెందిన పిచాయ్.. టెలివిజన్ లేదా కారు లేదని గతంలో ఒక ఇంటర్వ్యూలలో చెప్పారు. ఒక్కోసారి వాటికి రన్నింగ్ వాటర్ కూడా ఉండేది కాదని తెలిపారు. పిచాయ్ 12 ఏళ్ల వయస్సులో ఇంట్లోకి మొదటి రోటరీ టెలిఫోన్ వచ్చింది. అప్పుడే తనకు టెక్నాలజీని పరిచయం చేసిందని చెప్పారు. బ్రిటీష్కు చెందిన జీఈసీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా తండ్రి ఉద్యోగం చేసేవారు. అదే పిచాయ్ని టెక్ పరిశ్రమ వైపు ఆకర్షించేలా చేసింది.
స్కూళ్లో కూడా పిచాయ్ రాణించారు. చివరికి ఖరగ్పూర్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చోటు సంపాదించారు. అక్కడే తన ఇంజనీరింగ్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి స్కాలర్షిప్ను కూడా సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో పిచాయ్ విమాన టిక్కెట్ ఖర్చు, ఇతర ఖర్చుల కోసం ఆయన తండ్రి ఫ్యామిలీ సేవింగ్స్ నుంచి వెయ్యి డాలర్లు వెచ్చించారు.
మా తల్లిదండ్రులు జీవితాన్నే త్యాగం చేశారు :
2014లో ఇంటర్వ్యూలో పిచాయ్ మాట్లాడుతూ.. “అప్పట్లో చాలా మంది తల్లిదండ్రులు చేసినట్లే మా నాన్న, అమ్మ చేశారు. వారు తమ జీవితాన్ని చాలా త్యాగం చేశారు. వారి పిల్లలను చదివించేందుకు వారు కూడబెట్టుకున్న మొత్తం ఆదాయాన్ని వెచ్చించారు’ అని తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్లో మరో డిగ్రీని, మెకిన్సేలో కన్సల్టెంట్గా పనిచేసిన తర్వాత 2004లో గూగుల్ టూల్బార్, గూగుల్ క్రోమ్ వంటి ప్రధాన ప్రాజెక్ట్ల అభివృద్ధికి నాయకత్వం వహించి ప్రోడక్ట్ మేనేజర్గా గూగుల్లో పిచాయ్ చేరారు.
2015లో గూగుల్ సీఈఓగా పిచాయ్ బాధ్యతలు :
పిచాయ్ వినయం, సామర్థ్యంతో గూగుల్లో చేరిన మొదటి సంవత్సరాల్లో అద్భుతమైన విజయాలను సాధించిందని ఆయనతో కలిసి పనిచేసిన కేవల్ దేశాయ్ అన్నారు. పిచాయ్ను 2015లో సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ గూగుల్ సీఈఓగా ఎంపిక చేశారు. అయితే, లారీ పేజ్ కొత్తగా ఏర్పడిన హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాబెట్కు సీఈఓ అయ్యారు. బ్లూమ్బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని 10 మంది అత్యంత ధనవంతుల్లో లారీ పేజ్, సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఇద్దరు ఉన్నారు. అయితే, లారీ పేజ్ బాధ్యతల నుంచి వైదొలిగినప్పుడు 2019లో పిచాయ్ ఆ బాధ్యతలను స్వీకరించారు.