New Tax Rate Structure : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించామన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు చెప్పారు.
ఈ బడ్జెట్లో ఉద్యోగులకు స్వల్ప ఊరట మాత్రమే లభించింది. కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పులతో పాటు స్టాండర్ట్ డిక్షన్ విషయంలో కొంత ఊరట లభించింది. స్టాండర్ట్ డిడక్షన్ ప్రస్తుతం రూ.50 వేలు ఉండగా ఆ మొత్తాన్ని రూ.75వేలకు పెంచారు. దీంతో పన్ను చెల్లింపు దారులు రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చునని కేంద్ర మంత్రి వెల్లడించారు.
కొత్త పన్ను విధానంలో రూ.3లక్షల వరకు ఎలాంటి మార్పు లేదు. గతంలో రూ.3లక్షల నుంచి 6 లక్షల వరకు శ్లాబులో 5 శాతం పన్ను ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని రూ.7లక్షలకు పెంచారు. రూ.6లక్షల నుంచి రూ.9లక్షల వరకు ఉన్న శ్లాబును రూ.7లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మారింది.
కొత్త శ్లాబులు..
– మూడు లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
– రూ.3లక్షల నుంచి 7 లక్షల ఆదాయం వరకు 5 శాతం పన్ను
– రూ.7లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వరకు 10 శాతం పన్ను
– రూ.10 లక్షల నుంచి 12 లక్షల ఆదాయం వరకు 15శాతం పన్ను
– రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం వరకు 20 శాతం పన్ను
– రూ.15 లక్షల ఆదాయం ఆపై ఉంటే 30 శాతం పన్ను
ఇదిలా ఉంటే.. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు.
– రూ.2.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
– రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల ఆదాయం వరకు 5 శాతం పన్ను
– రూ.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం వరకు 20 శాతం పన్ను
– రూ.10లక్షల ఆదాయం పైన ఉంటే 30 శాతం పన్ను.