Salary Hike : కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా అరకొర వేతన పెంపుతో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులకు తీపికబురు అందింది. వచ్చే ఏడాది సగటు వేతన పెంపు కొవిడ్-19కు ముందున్న పరిస్థితులకు చేరనుంది. ఈ ఏడాది 8.8 శాతంగా అంచనా వేసిన వేతన పెంపు 2022లో 9.4 శాతంగా ఉంటుందని ఏఓఎన్ 26వ వార్షిక వేతన పెంపు సర్వేలో వెల్లడించింది.
39 రంగాలకు చెందిన 1350 కంపెనీల ప్రతినిధులను ఈ సర్వే ఇంటర్వ్యూ చేసింది. 2021లో పలు రంగాల్లో ఉద్యోగుల వలసలు, నిష్ర్కమణల రేటు 20 శాతంగా ఉంటుందని దీంతో నియామకాల ప్రక్రియా ఊపందు కుంటుందని సర్వే వెల్లడించింది. వచ్చే ఏడాది ఆశాజనకంగా ఉంటుందని 98.9 శాతం కంపెనీలు అంచనా వేస్తూ 2022లో వేతన పెంపు చేపడతామని చెప్పాయి.
9.4 శాతం సగటు వేతన పెంపు ప్రతిపాదన ఆరేళ్ళలో అత్యధిక వేతన పెంపు ఇదే కానుండటం గమనార్హం. 2021లో సగటు వేతన పెంపు 8.8 శాతానికి పరిమితమైంది. సెకండ్ వేవ్ అనంతరం ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్న క్రమంలో వచ్చే ఏడాది అంతా సానుకూలంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
అన్ని రంగాల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొందని… వచ్చే ఏడాది నాటికి మహమ్మారికి ముందున్న స్ధాయిలో వేతన పెంపులు చేపడతామని పలు సంస్ధలు వెల్లడించాయని సర్వే స్పష్టం చేసింది. ఇక వచ్చేఏడాది ఐటీలో అత్యధికంగా 10.6 శాతం సగటు వార్షిక వేతన పెంపు ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలో 8.8 శాతం, రెస్టారెంట్లు, ఆతిధ్య రంగంలో 7.9 శాతం సగటు వేతన పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది.