LPG e-KYC : గ్యాస్ వినియోగదారులకు అర్జెంట్ అలర్ట్.. జూన్ 30లోపు ఈ ఒక్క పనిచేయకపోతే సబ్సిడీ రాదు?
LPG e-KYC : గ్యాస్ వినియోగదారులకు బిగ్ బ్రేకింగ్.. అర్జెంట్గా e-KYC చేయించుకోండి.. జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోనుంది. జూన్ 30లోగా చేయకపోతే ఎవరికి సబ్సిడీ నిలిచిపోతుందంటే?
- Sreehari A
- Published on- June 26, 2026 / 04:14 PM IST
LPG e-KYC by June 30
- గ్యాస్ వినియోగదారులారా జాగ్రత్త.. జూలై 1కి ముందే ఇది పూర్తి చేయండి!
- LPG సబ్సిడీపై కీలక అప్డేట్.. వెంటనే e-KYC చెక్ చేసుకోండి!
- జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ రాదా? అసలు నిజం ఇదే!
LPG e-KYC : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా కేవైసీ చేయించుకోవాలంటూ మెసేజ్ వచ్చిందా? ప్రస్తుతం వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇదే మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.
జూన్ 30, 2026లోపు ఎల్పీజీ eKYC పూర్తి చేయకపోతే జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోతందంటూ అందులో ఉంది. వాస్తవానికి, ఈ మెసేజ్లో కొంత నిజమే ఉంది. కానీ పూర్తిగా కాదు.. ఈ మెసేజ్ చూసినవారంతా సబ్సిడీ కోల్పోతామని భయపడుతున్నారు. అసలు నిజం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మెసేజ్ నిజమా? ఫేక్?
పూర్తిగా ఫేక్ కాదు… అలా అనీ పూర్తిగా నిజం కూడా కాదు.. ఎందుకంటే.. ఎల్పీజీ కంపెనీలు eKYC పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. అయితే, ప్రతి ఒక్కరి గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుందని వైరల్ అవుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్నారో వారిపైనే ప్రభావం ఉంటుంది అంతే..
మూడు ప్రభుత్వ ఎల్పీజీ కంపెనీలైన ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులను eKYC పూర్తి చేయాల్సిందిగా సూచిస్తున్నాయి. జూన్ 30 నాటికి eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా eKYC పెండింగ్లో ఉంటే డీబీటీ ద్వారా వచ్చే ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
అందరికీ సబ్సిడీ ఆగిపోతుందా? :
లేదు. ఇదే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గత కొన్ని ఏళ్లుగా సాధారణ ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీ చాలా తక్కువగా ఉంది. అలాగే, మీరు మార్కెట్ ధరకే సిలిండర్ కొంటున్నారు కదా.. మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడం లేదు కదా.. అలాంటప్పుడు సాధారణ కుటుంబాలకు eKYC ఆలస్యమైనా ప్రస్తుతం సబ్సిడీ పోతుందనే భయం అవసరం లేదు.
Read Also : Free AC Yojana Scam : బాబోయ్.. ‘ఫ్రీ AC యోజన’ పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్తో ఖాతా ఖాళీ!
ఎవరికి నిజంగా నష్టమంటే? :
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు మాత్రం ఇది సీరియస్గా తీసుకోవాలి. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన కుటుంబాలకు ఇప్పటికీ 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై సుమారు రూ.300 వరకు సబ్సిడీ డీబీటీ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. eKYC పూర్తి చేయనివారికి ఒక్కో సిలిండర్కు వచ్చే రూ.300 వరకు సబ్సిడీ నిలిచిపోవచ్చు. తరచుగా సిలిండర్ తీసుకునే కుటుంబాలకు భారీ నష్టమే.
ఎల్పీజీ eKYC ఎలా పూర్తి చేయాలి? :
ఇందుకోసం ఎవరికి మీరు డబ్బులు చెల్లించక్కర్లేదు. ఇది పూర్తిగా ఉచితం.
ఈ మూడు మార్గాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ ద్వారా అయితే..
- ఇండేన్ ( IndianOil ONE)
- హెచ్ పీ గ్యాస్ (HP Pay)
- భారత్ గ్యాస్ (Bharat Gas App)
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అయి ఆధార్ ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా eKYC పూర్తి చేయవచ్చు.
గ్యాస్ ఏజెన్సీ ద్వారా :
ఆధార్ కార్డుతో మీ LPG డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లి కొన్ని నిమిషాల్లో eKYC పూర్తి చేయించుకోవచ్చు.
డెలివరీ బాయ్ ద్వారా :
కొత్త సిలిండర్ డెలివరీ సమయంలో చాలా మంది డెలివరీ సిబ్బంది మొబైల్ యాప్తోనే eKYC పూర్తి చేసే సదుపాయాన్ని అందిస్తారు.
eKYC పూర్తి అయిందా? లేదా? :
మీ ఎల్పీజీ కంపెనీ అధికారిక యాప్లో లేదా అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి కూడా తెలుసుకోవచ్చు. కనెక్షన్ వివరాల్లో కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. కంప్లీటెడ్ ఉంటే అయినట్టు.. పెండింగ్ అంటే ఇంకా కాలేదని అర్థం.
స్కామర్లతో జాగ్రత్త :
ఇలాంటి డెడ్లైన్ల సందర్భాల్లో సైబర్ మోసగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతుంటారు. గ్యాస్ కనెక్షన్ వెరిఫై చేయండని ఫేక్ లింకులు పంపుతారు.. ఓటీపీలు అడుగుతారు. ఆధార్, బ్యాంక్ వివరాలు కోరే మెసేజ్లను పంపుతుంటారు.
- ఎల్పీజీ eKYC పూర్తిగా ఉచితం.
- ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
- ఎవరికీ OTP చెప్పొద్దు.
- అధికారిక LPG యాప్ లేదా మీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మాత్రమే eKYC చేయించుకోండి.
