RBI New Rules : రుణగ్రహీతలకు అలర్ట్.. లోన్ EMI కట్టకపోతే బ్యాంకులు మీ ఫోన్ లాక్ చేస్తాయా? RBI కొత్త నిబంధనలివే..!
RBI New Rules : లోన్ చెల్లించనందుకు బ్యాంకులు మీ ఫోన్ను లాక్ చేయగలవా? ఆర్బీఐ కొత్త నిబంధనలతో రుణగ్రహీతలకు రిలీఫ్ దక్కనుందా? బ్యాంకులు వేధించడం, అవమానించడం లేదా బెదిరించడం చేయకూడదా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
RBI New Rules ( Image Credit : AI )
- లోన్ డిఫాల్ట్ అయినా టెన్షన్ వద్దు.. బ్యాంకులకు RBI కొత్త ఆంక్షలు
- లోన్ EMI మిస్ అయితే ఫోన్ లాక్ చేస్తారా..? అసలు రూల్ ఇదే
- ప్రతి రుణగ్రహీత తప్పక తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
RBI New Rules : ఈఎంఐలో కొత్త ఫోన్ కొన్నారా? మీరు తీసుకున్న లోన్ నెలనెలా ఈఎంఐ ద్వారా చెల్లిస్తున్నారా? మీకు ఒక నెల ఈఎంఐ మిస్ అయిందా? అయితే, ఇప్పుడు మీకు లోన్ ఇచ్చిన బ్యాంకులకు మీ ఫోన్ లాక్ చేసే అధికారం ఉందా?
లోన్ ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు ఏం చేయగలవు? మీ మొబైల్ ఫోన్ లాక్ చేయొచ్చా? దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 1, 2027 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
నిబంధనల ప్రకారం.. పర్సనల్ లోన్, హోం లోన్ లేదా వెహికల్ లోన్ వంటి బకాయిల వసూళ్ల కోసం బ్యాంకులు రుణగ్రహీతల మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లేదా ట్యాబ్లెట్ను లాక్ చేయడం లేదా ఆయా ఫీచర్లను ఆపేయడం చేయరాదు. అది కూడా లోన్ పెట్టి కొన్న ఫోన్ విషయంలో మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. లోన్ అగ్రిమెంట్ ముందుగానే స్పష్టంగా పేర్కొన్న నిబంధనల మేరకు పరిమిత ఆంక్షలు విధించవచ్చు.
ఆర్బీఐ ప్రకారం.. ఒక్క ఈఎంఐ మిస్ అయిన వెంటనే ఫోన్ను లాక్ అయ్యే ఛాన్స్ లేదు. లోన్ అకౌంట్ కనీసం 30 రోజులు బకాయిలో ఉండాలి. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే దశలవారీగా ఆంక్షలు అమలు చేయాలి. 60 రోజుల వరకు అవుట్గోయింగ్ కాల్స్ కూడా ఆపేయకూడదు.
ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, అత్యవసర SOS వంటి కీలక ఎమర్జెన్సీ సర్వీసులను ఎప్పటికీ టచ్ చేయరాదు. అలాగే, రుణగ్రహీత ఉద్యోగం లేదా జీవనోపాధిపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి. బకాయి చెల్లించిన గంటలోపు అన్ని పరిమితులను తొలగించాలి. ఆలస్యం అయితే, ప్రతి గంటకు రూ.250 చొప్పున బకాయి రుణ మొత్తాన్ని మించకుండా పరిహారం చెల్లించాల్సిందిగా ఆర్బీఐ నిబంధనల్లో స్పష్టం చేసింది.
రుణగ్రహీతలను వేధింపులకు గురిచేయొద్దు :
బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు, థర్డ్పార్టీ సంస్థలు లోన్ తీసుకున్నవారిని మొత్తం కట్టాలంటూ వేధిస్తుంటారు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై అలా చేయడం పూర్తిగా నిషేధం.. లోన్ పొందినవారి పర్సనల్ డేటా, కాంటాక్టులు, ఫొటోలు, మెసేజ్లు లేదా లొకేషన్ వివరాలను అసలు తీసుకోరాదు.
అలాగే, రుణగ్రహీతలను బెదిరించడం, దుర్భాషలాడటం, సోషల్ మీడియాలో అవమానించడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను వేధించడం, పదేపదే కాల్స్ చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం వంటి వసూలు పద్ధతులను కచ్చితంగా మానేయాలి.
రుణగ్రహీతలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలని ఆర్బీఐ కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అంటే.. రుణ వసూళ్లలో పారదర్శకతతో పాటు రుణగ్రహీతల గౌరవం, గోప్యతకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను ఆర్బీఐ తీసుకువస్తోంది.
