రైలు ప్రయాణికులకు శుభవార్త….కావాల్సినన్ని తత్కాల్ టికెట్లు

  • Publish Date - February 21, 2020 / 09:06 AM IST

ఎక్కడి కైనా ఊరు  వెళ్లాలంటే  మొదట గుర్తుకు వచ్చేది రైలు. రైల్లో ప్రయాణానించటానికే ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తుంటారు.  చార్జీలు తక్కువగా ఉంటాయి. రైలు ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే మెజార్టీ ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారు.  కొంత మంది అనుకోకుండా ఉన్నట్టుండి రైలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు  రైలు టికెట్ కొనాలంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. అటువంటి సమయంలో అవకాశాన్ని బట్టి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారు. 

తత్కాల్ టికెట్లకు సాధారణ టికెట్ బుకింగ్కు చెల్లించేదానికంటే కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏం… జర్నీలో బెర్త్, సీటు కనఫర్మ్ గా దొరుకుతాయి. రైల్వే శాఖ తత్కాల్ టికెట్లు ఇచ్చే సమయానికి రెడీగా ఉండి చాలా స్పీడ్ గా టికెట్లు బుక్ చేసుకోవాలి. లేదంటే  టికెట్లు దొరకని పరిస్ధితి ఏర్పడుతుంది.

ఇప్పడు ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగం ఉండబోతోంది. చట్ట విరుధ్దమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించి టికెట్లు బ్లాక్ చేస్తున్న 60 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. ఆధునిక టెక్నిలజీ ఉపయోగించి  వీరు సామాన్య ప్రయాణికులకు  తత్కాల్  టికెట్ల్దు అందకుండా సాఫ్ట్ వేర్ లో బ్లాక్ చేసేవారు.

రైల్వే అధికారులు చెప్పిన ప్రకారం.. ఏఎన్ఎంఎస్, ఎంఏసీ, జాగ్వార్ వంటి సాఫ్ట్‌వేర్లతో ఐఆర్‌సీటీసీ లాగిన్ క్యాప్చా, బుకింగ్ క్యాప్చా, బ్యాంక్ ఓటీపీ వంటి వివరాలతో ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసేవారు. దీన్ని గమనించిన రైల్వేస్ ఇప్పుడు ఆ ఏజెంట్లను అరెస్ట్ చేసింది. సాధారణంగా ఒక వ్యక్తి టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవడానికి 2.55 నిమిషాల సమయం పడుతుంది. కానీ కొందరు ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ఈ ప్రక్రియను 1.48 నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. దీంతో బుకింగ్‌ ప్రారంభమైన నిమిషాల్లోనే తత్కాల్‌ టికెట్లు అయిపోతున్నాయి. 

దీన్ని గుర్తించిన ఆర్పీఎఫ్‌ అధికారులు అక్రమ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్న వారిని కనిపెట్టి అవి తొలిగించడంతోపాటు 60 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరిలో ఒకడికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. తత్కాల్ టికెట్ బుకింగ్ ద్వారా ఏజెంట్లు సంవత్సరానికి ఏకంగా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు బిజినెస్ నిర్వహించే వారని ఆర్‌‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.

ఇకపై చట్టవిరుద్దమైన సాఫ్ట్‌వేర్ ద్వారా ఒక్క తత్కాల్ టికెట్ కూడా బుక్ చేయకుండా కఠిన చర్యలు తీసుకున్నామని ఆయన  పేర్కొన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. రైల్వే శాఖ  తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే తత్కాల్ టికెట్ బుకింగ్ లభ్యత పెరిగింది.