Revolt RV400: రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆర్వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. జూన్ నెలలో తొలిసారి ఈ బైక్ అమ్మకానికి పెట్టినపుడు రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్లన్నీబుక్ అయిపోయాయి. దీంతో బుకింగ్ను ఆపేసింది రివోల్ట్. ఆ విడతలోనే రూ.50కోట్ల విలువైన బైక్లకు బుకింగ్స్ వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఇక ఇప్పుడు రెండోసారి బుకింగ్స్ పెట్టినా ఇప్పుడు కూడా అదే పరిస్థితి.
బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండోసారి కూడా క్షణాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించిందని కంపెనీ వెల్లడించింది. మొదటి బుకింగ్స్లోనే రికార్డు అమ్మకాలను సాధించిన ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 బుకింగ్లను తిరిగి ప్రారంభించిన నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్గా నిలిచిందని కంపెనీ తెలిపింది. తమ బైక్స్ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం నాలుగు నెలలు ఉండగా.. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, తద్వారా వెయిటింగ్ టైంను తగ్గించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించింది.
ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై,అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సబ్సిడీలు ప్రకటించడంతో రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ధరలు భారీ తగ్గాయి. ఈ బైక్లకు డిమాండ్ విపరీతంగా పెరిగేందుకు ఇది ఓ కారణంగా ఉంది. సబ్సిడీలు లభించడంతో ఆర్వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించి రూ.1,19,000 ధరకే బుకింగ్కు పెట్టింది. దీంతో వినియోగదారులు పోటీపడి మరీ బుక్ చేసుకోవడంతో రెండు గంటల్లోనే బుకింగ్స్ పూర్తయ్యాయి.